నరసాపురం: మొగల్తూరు మామిడి పూర్వ ప్రాభవం క్రమంగా కోల్పోతోంది. తీరంలో మామిడి తోటల విస్తీర్ణం రానురానూ తగ్గిపోతున్నాయి. తీర ప్రాంతంలోని ఇసుక నేల సారం ఆధారంగా అద్భుత రుచి మొగల్తూరు మామిడి ప్రత్యేకం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వారు దేశ, విదేశాల్లోని బంధువులు, స్నేహితులకు ఏటా వేసవి సీజన్లో వీటిని పంపిస్తుంటారు. దీంతో మొగల్తూరు మామిడికి దేశ, విదేశాల్లోనూ మంచి క్రేజ్. పెరుగుతున్న పట్టణీకరణ, లేఅవుట్లతో ఏటేటా తోటలు విస్తీర్ణం తగ్గుతోంది. దీనికితోడు తోటలు తెగుళ్ల బారిన పడుతుండటంతో కాపు తగ్గుతోంది.
మొగల్తూరు మామిడా.. మజాకా
మొగల్తూరు, పేరుపాలెం చుట్టుప్రకల ప్రాంతాల్లో దాదాపు 1,800 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నా యి. చెరుకురసం, చిన్నరసాలు, పెద్దరసాలు, కొ త్తపల్లి కొబ్బరి రకాలు ఇక్కడ ఫేమస్. మరీ ము ఖ్యంగా మొగల్తూరు బంగినపల్లికి మంచి పేరుంది. ఇక ఆవకాయ పచ్చళ్లకు సంబంధించి సువర్ణరేఖ, కలెక్టర్, హైజర్ రకాలు ప్రసిద్ధి. జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి పలువురు ఇక్కడకు వచ్చి మామిడిపండ్లు, పచ్చడి కాయలు కొనుగోలు చేస్తుంటారు. వేసవి సీజన్లో మొగల్తూరు మామిడి మార్కెట్ కిటకిటలాడుతుంది.
తెగుళ్ల బారిన తోటలు
మామిడి చెట్లకు మచ్చతెగులు, మంచు తెగులు వంటివి సోకుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడంతో ఇళ్ల స్థలాలకు లేఅవుట్స్ చేయడంతో తోటలు నరికేస్తున్నారు. దీంతో విస్తీర్ణం తగ్గిపోతుంది. ఒకప్పుడు మొగల్తూరు చుట్టుపక్క 5 వేల ఎకరాల్లో తోటలు ఉండగా ప్రస్తుతం 2 వేల ఎకరాలకు తగ్గిపోయాయి. ప్రస్తుతం తోటల రూపంలో కంటే ఇంటి పెరట్లలో వీటిని పెంచుతున్నారు. ఆదాయ మార్గం ఉండటంతో పెరట్లలో, ఖాళీ స్థలాల్లో వీటిని పెంచుతున్నారు. ఇక గాలి దుమారంతో పిందెలు, కాయలు రాలిపోవడం వంటి కారణాలతో కూడా కాపు తగ్గుతుంది.
తోటల్లోనే పంట విక్రయం
మొగల్తూరు మామిడి వ్యాపారం వేసవి సీజన్కు ముందే ప్రారంభమవుతుంది. శీతాకాలంలో పిందె దశలోనే రైతులు తోటల్లో పంటను విక్రయిస్తుంటా రు. ఒక్కో చెట్టూ రూ.20 వేల నుంచి రూ.30 వేల వ రకూ విక్రయిస్తుంటారు. చెట్లు కాపును బట్టి వ్యా పారులు కొనుగోలు చేసుకుని కాయలు తయారైన తర్వాత విక్రయిస్తుంటారు. దూరప్రాంతాలు, పక్క జిల్లాల నుంచి వచ్చి పలువురు చెట్లు వద్దే కొనుగోలు చేసి తీసుకెళ్లడం, బంధువులకు, స్నేహితులకు దేశ, విదేశాలకు పంపడం చేస్తుంటారు.
ఆలస్యంగా మార్కెట్లోకి..
సాధారణంగా మార్చి, ఏప్రిల్ నుంచి మామిడి పండ్లు మార్కెట్కు వస్తుంటాయి. అయితే మొగల్తూరు ఆలస్యంగా కాపునకు వస్తుంది. మే ప్రారంభం నుంచి జూన్, జూలైలో కూడా మొగల్తూరు మామిడి పండ్లు దొరుకుతాయి. ఈ ఏడాదిలో ఇప్పుడిప్పుడే మొగల్తూరు మామిడిపండ్లు మార్కెట్కు వస్తున్నాయి. ప్రస్తుతం పరక రకాన్ని బట్టి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. బంగినిపల్లి రకం కాయ ఒక్కటి రూ.40 నుంచి రూ.80 వరకు అమ్ముతున్నారు.
ఏటా తగ్గుతున్న విస్తీర్ణం
పట్టణీకరణ, లేఅవుట్లతో తోటలు కనుమరుగు
తెగుళ్లతో ఇక్కట్లు
తగ్గుతున్న దిగుబడులు


