పెనుగొండ: కక్ష సాధింపుల్లో భాగంగానే అక్రమ కేసు బనాయించారని బెయిల్పై విడుదలైన వైస్సార్సీపీ నాయకుడు, కొడమంచిలి మాజీ సర్పంచ్ సుంకర సీతారామ్ ఆరోపించారు. శనివారం బెయిల్పై నరసాపురం సబ్ జైలు నుంచి ఆచంట చేరుకుని దివంగత సీఎం వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లేనిపోని ఆరోపణలతో తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తోందన్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకులను టార్గెట్ చేసి స్థానిక ఎమ్మెల్యే ఫ్యాక్షన్ రాజకీయాలు తెరలేపారని విమర్శించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు, కక్ష సాధింపులపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. మండల కన్వీనర్ జక్కంశెట్టి శ్రీరామ్, నాయకులు కోట వెంకటేశ్వరరావు, పాస్టర్ డేవిడ్ రాజు, జక్కంశెట్టి చంటి, పిల్లి రుద్రప్రసాద్, కేతా తాతారావు, కాండ్రేగుల కనకయ్య, పెచ్చెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: స్థానిక డీఎన్నార్ కళాశాలలో శనివారం పీజీ సెట్ ప్రశాంతంగా జరిగింది. డీఎన్నార్ అటానమస్ కళాశాల సెంటర్లో మూడు సెషన్స్లో 278 మంది విద్యార్థులకు 248 మంది హాజరయ్యారు. డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో 200 మంది 189 మంది హాజరయ్యారు.
పెంటపాడు: బడిఈడు పిల్లలను బడిలో చేర్పించే ఎన్రోల్మెంట్లో పెంటపాడు మండలం జిల్లాలో ప్రథమస్థానం సాధించిందని ఎంఈఓలు ఎం.శ్రీనివాస్, టీవీ రామకృష్ణ తెలిపారు. ఐదేళ్లు పూర్తయిన వారిని బడిలో చేర్చే కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలం 55 శాతం పూర్తి చేయాలని డీఈఓ ఆఆదేశించారన్నారు. పెంటపాడు మండలంలో 59.84 శాతం ఎన్రోల్మెంట్ సాధించిందన్నారు. కె.పెంటపాడు, పెంటపాడు, పలు గ్రామాల్లో శనివారం కార్యక్రమం చేపట్టి మరో ఆరుగురు పిల్లలను బడిలో చేర్పించామని చెప్పారు. క్లస్టర్ హెచ్ఎం కృష్ణ, ఉపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): ఈపీఎఫ్ పెన్షన్ రూ. 7,500కు పెంచాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంఘం ఏలూరు కమి టీ తెలిపింది. స్థానిక ఐఎఫ్టీయూ కార్యాలయంలో ధర్నా పోస్టర్ను శనివారం ఆవిష్కరించారు. ఐఎఫ్టీయూ నగర అధ్యక్షుడు బి. సో మయ్య మాట్లాడుతూ 30 ఏళ్లుగా ఈపీఎఫ్ పెన్షన్ పెంచలేదన్నారు. పార్లమెంటరీ కమిటీ పెన్షన్ రూ.7,500 పెంచాలని, కరువు భత్యం (డీఏ) లింకు చేయాలని, పెన్షన్దారులకు వైద్య సౌకర్యం కల్పించాలని సిఫార్సు చేసిందన్నారు. వీటిని వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురావాలని కోరారు. ధర్నాలో పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు. వెంకటేశ్వరరావు, ఈపీఎఫ్ పెన్షన్దారుల సంఘ నాయకులు కోసూరి నూకరాజు, బుద్దా నాగేశ్వరరావు, కొంపంగి కృష్ణ పాల్గొన్నారు.
నరసాపురం రూరల్: బాలికపై బంధువు అఘాయిత్యానికి పాల్పడగా పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మొగల్తూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక బంధువుల వద్ద ఉంటూ ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఆమె బంధువయ్యే ఓ వివాహితుడు చనువుగా ఉంటూ మాటలతో నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మొగల్తూరు ఎస్సై కె.నాగేశ్వరరావు కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు.


