ద్వారకాతిరుమల: చినవెంకన్న క్షేత్రంలో శుక్రవారం రాత్రి వివాహాలు భారీగా జరిగాయి. దీంతో క్షేత్రంలో పెళ్లిసందడి నెలకొంది. సాయంత్రం నుంచే పెళ్లి జనాల వాహనాలు టోల్గేట్ మీదుగా శ్రీవారి కొండపైకి చేరుకున్నాయి. కొండపైన పార్కింగ్ ప్రదేశాలు, ఘాట్ రోడ్లు పెళ్లి జనాల వాహనాలతో రద్దీగా మారాయి. గుడి సెంటర్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్ సిబ్బంది, ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని అనివేటి మండపాల్లో, స్వామివారి పాదుకా మండపం వద్ద ఉన్న పాత కల్యాణ మండపంలో, కొండపైన, దిగువన కల్యా ణ మండపాల్లో పెద్ద ఎత్తున వివాహాలు జరిగాయి. దాదాపు అన్ని ప్రైవేట్ కల్యాణ మండపాల్లోనూ వివాహాలు జరిగాయి. నూతన వధూవరులు శనివారం వేకువజామున స్వామి, అమ్మవార్లను దర్శించుకోనున్నారు.


