కొయ్యలగూడెం: దేవదాయ శాఖ ద్వారా పలు గ్రామాల్లో ధూప దీప నైవేద్యాలు (డీడీఎన్ పథకం) అందించే ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. కొయ్యలగూడెంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. అలాగే గ్రామ దేవత శ్రీ చింతాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద వివరాలు సేకరించారు. బుట్టాయిగూడెం మండలంలోని పులిరామన్నగూడెం రోడ్డులో ఉన్న సూదికొండ మావుళ్ళమ్మ ఆలయానికి కూడా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. ఎండోమెంట్ ఈవో శ్రీలక్ష్మి, ఏఈ భాను సిబ్బంది పాల్గొన్నారు.


