తాడేపల్లిగూడెం (టీఓసీ): ప్రభుత్వ పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యాక్రమాన్ని తాడేపల్లిగూడెంలోని జిల్లా పాఠ్య పుస్తక కార్యాలయం నుంచి గురువారం ప్రారంభించారు. కార్యాలయ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మేనేజర్ పీవీ సుధాకర్ పర్యవేక్షించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 2 లక్షల విద్యార్థులకు గానూ 202627కి సుమారు 13 లక్షల పుస్తకాలు అవసరం కాగా ప్రభుత్వ పుస్తక విక్రయ కేంద్రానికి 10 లక్షల 03 వేల పుస్తకాలు వచ్చాయి. ఈ పుస్తకాలలో 58 వేల పుస్తకాలను ఏలూరు రూరల్, అర్బన్ పరిధిలోని మండల పాయింట్లుకు పంపారు. మొదటి సెమిస్టర్కు గానూ ఒకటో తరగతికి అన్ని టైటిల్స్ రాగా, 2వ తరగతికి మూడు టైటిల్స్, 3, 4, 5 తరగతులకు అన్ని టైటిల్స్, 6వ తరగతికి ఒక టైటిల్, 7వ తరగతికి మూడు టైటిల్స్, 8వ తరగతికి ఒక టైటిల్, 9,10వ తరగతులకు అన్ని టైటిల్స్ వచ్చాయి. శుక్రవారం తాడేపల్లిగూడెం, పెంటపాడు, ఆచంట, పోడూరులకు పుస్తకాలను ఆర్టీసీ బస్సుల ద్వారా అందజేయనున్నారు. ఆర్టీసీ డీఎం పి.దానమ్మ, కార్గో మేనేజర్ జి.మాధవరావుతో ఇరు కార్యాలయాల సిబ్బంది హాజరయ్యారు.


