ఎండలో మాడిపోతున్నాం
గ్యాస్ కొరతను పరిష్కరిస్తాం
కైకలూరు: మండలంలో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు యుద్ధం చేయాల్సి వస్తుంది. మే నెలలో 39 డిగ్రీల సెంటీగ్రేట్ ఉష్ణోగ్రతలు మద్య మలమల మాడుతూ సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్ద ప్రజలు పడిగాపులు పడుతున్నారు. కై కలూరులో మంత్రి పార్థసారథికి చెందిన సారథి గ్యాస్ ఏజెన్సీ వద్ద ఓటీపీలు పనిచేయకపోవడంలో సహనం కోల్పోయిన వినియోదారులు మంగళవారం కార్యాలయంలోకి దూసుకుపోయారు. నియోజకవర్గంలో కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో కలిపి మొత్తం 77,501 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరికి గ్యాస్ సరఫరా చేయడానికి నాలుగు మండలాల్లో భారత్, ఇండియన్, హెచ్పీ కంపెనీలకు చెందిన 6 ఏజెన్సీలు ఉన్నాయి. కొన్ని ఏజెన్సీలు డోర్ డెలవరీని యుద్ధం వంకతో ఆపేశాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలందరూ ఏజెన్సీ కార్యాలయాలకు ఉదయం 5 గంటలకే ఖాళీ సిలిండర్లతో లైన్లో వేచి ఉంటున్నారు. మరికొందరు ఏకంగా రాత్రి ఏజెన్సీల వద్దే పడుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా వ్యవస్థను గాడిలో పెట్టడానికి అధికారులు ప్రయత్నిచండం లేదు.
మంత్రి సారథి ఏజెన్సీ వద్ద మాడుతున్న ప్రజలు..
కై కలూరులో గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథికి చెందిన సారథి గ్యాస్ ఏజెన్సీ ఉంది. అత్యధికంగా వినియోగదారలు ఈ ఏజెన్సీ కిందే ఉన్నారు. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది గ్యాస్ సిలిండర్లలో వేచి ఉన్నారు. మండుటెండలో రోడ్డుపై నిలబడ్డారు. ఉదయం 10:30కి ఓటీపీలు పనిచేయడం లేదని సిబ్బంది చెప్పడంతో వేచి ఉన్న అందరూ అసహానాకి గురయ్యారు. అనేక మంది కార్యాలయంలో సిబ్బందితో గొడవకు దిగారు. తహసీల్దారు రామకృష్ణ, పోలీసులతో వచ్చి సమన్యను పరిష్కరించారు. ఇక్కడ వినియోగదారులు పడుతున్నా ఇబ్బందులపై మంత్రి సారథి దృష్టి సారించాలని కోరుతున్నారు. మిగిలిన ఏజెన్సీలు డోర్ డెలివరీ చేస్తోన్నాయని, ఈ ఏజెన్సీలో కూడా డోర్ డెలివరీని పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
డోర్ డెలివరీని నిలిపేసిన మంత్రి ఏజెన్సీ
నేను ఉదయం 6.30 గంటలకు భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్దకు వచ్చాను. అప్పటికే అనేక మంది సిలిండర్లను లైన్లో పెట్టారు. వృద్ధులు, మహిళలు అందరం ఎండలో మలమల మాడిపోయాం. గతంలో మా గ్రామాలకు గ్యాస్ సిలిండర్ల బండి వచ్చేది. ఎదో యుద్ధం పేరు చెప్పి అందరినీ ఇబ్బంది పెడుతోన్నారు.
– వి.విష్ణురెడ్డి, అయోధ్యపట్నం, వినియోగదారుడు
సిలిండర్ల లోడ్లు తగినంతగా రాకపోవడంతో సమస్య మొదలైంది ఇదే కాకుండా ఓటీపీ సిస్టంలో సాంకేతిక సమస్య వస్తుంది. దీనిని పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నాం. వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ సిలిండర్లు వినియోగించేవారిపై ఇప్పటికే కేసులు నమోదు చేశాం.
– కె.వెంకటరమణ, డిప్యూటీ తహసీల్దార్, పీడీఎస్, కై కలూరు


