కర్తవ్య నిర్వహణలో విగతజీవులై.. | - | Sakshi
Sakshi News home page

కర్తవ్య నిర్వహణలో విగతజీవులై..

Jun 27 2025 4:04 AM | Updated on Jun 27 2025 4:04 AM

కర్తవ

కర్తవ్య నిర్వహణలో విగతజీవులై..

ఆలమూరు : కర్తవ్య నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. మాదక ద్రవ్యాలు (గంజాయి) రవాణా చేస్తున్న నిందితుడిని పట్టుకోవడానికి వెళుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవం రోజునే ఆ ఇద్దరు అధికారులు అశువులు బాసారు. వివరాల్లోకి వెళితే.. ఆలమూరు మండల పరిధిలోని 216 ఏ జాతీయ రహదారిలో గతంలో గంజాయి అక్రమ రవాణా కేసు నమోదైంది. ఆ కేసులో నిందితుల్లో ఒకరు హైదరాబాద్‌లో ఉన్నాడన్న సమాచారంతో అతడ్ని పట్టకునేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం రాత్రి ఆలమూరు ఎస్సై అశోక్‌, ఆత్రేయపురం కానిస్టేబుల్‌ ఎస్‌.బ్లెసన్‌ జీవన్‌, రావులపాలెం సీఐ కార్యాలయం ఐడీ పార్టీ హెడ్‌ కానిస్టేబుల్‌ దొంగ స్వామి, డ్రైవర్‌ జి.రమేష్‌ కారులో హైదరాబాద్‌ బయలు దేరారు. కోదాడ సమీపంలోని దుర్గాపురం వద్దకు వచ్చేసరికి వారు ఓ లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఎస్సై అశోక్‌ (45) కానిస్టేబుల్‌ బ్లెసన్‌ (32) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్‌ రమేష్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ స్వామికి తీవ్ర గాయాలయ్యాయి.

పదోన్నతి వస్తుందనుకునే లోపే..

అశోక్‌ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే ఉన్నతాధికారుల సాయంతో అనేక కేసులను ఛేదించి పలు అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నారు.ఈ ఏడాది సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి వస్తుందని కుటుంబ సభ్యులు భావిస్తున్న నేపథ్యంలో ఇంతటి ఘోరం జరగడం వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అశోక్‌ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని రుస్తుంబాదా కాగా ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. ఆయనకు భార్య శ్రీవల్లి, ఇద్దరు సోదరులు, ఒక సోదరి, ఇద్దరు కుమారులు ఉన్నారు.

బ్లెసన్‌ మృతిపై విలపించిన సోదరులు

విధి నిర్వహణలో ఎస్సై అశోక్‌కు తోడుగా వెళ్లి మృత్యు ఒడిలోకి వెళ్లిన కానిస్టేబుల్‌ బ్లెసన్‌ స్వస్థలం ఆలమూరు. ఆయన తన తల్లి హెప్సీబా, సోదరులు ప్రిన్స్‌ ఆదిత్య, అలెక్స్‌ కలసి ఉంటున్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన బ్లెసన్‌ తమ కుటుంబానికి అండగా ఉంటాడనుకుంటే హఠాత్తుగా మృతి చెందడంపై కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వచ్చే ఏడాది కొత్త ఇల్లు నిర్మించుకుని పెళ్లి చేసుకుందామనుకుంటున్న తన సోదరుడు బ్లెసన్‌ ఆ ముచ్చట తీరకుండానే కానరాని లోకాలు వెళ్లిపోయాడని సోదరులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్‌ మృతి

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

గంజాయి రవాణా నిందితుడి అన్వేషణలో దుర్ఘటన

నరసాపురంలో అంత్యక్రియలు

నరసాపురంలో విషాదఛాయలు

నరసాపురం: ఆలమూరు ఎస్సై ముద్దాల అశోక్‌ మృతిపై నరసాపురంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆయన మృతేహాన్ని గురువారం సాయంత్రం స్వస్థలమైన నరసాపురం తీసుకొచ్చారు. కోనసీమ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ఇతర పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు అశోక్‌కుమార్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం వశిష్ట గోదావరి గట్టున ఉన్న మహాప్రస్థానం శ్మశానవాటిక వద్ద పోలీసు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అశోక్‌ తండ్రి నర్శింహమూర్తి సాధారణ రైతు. తల్లి గృహిణి. వారు గతంలోనే మృతి చెందారు. అశోక్‌ వారంరోజుల క్రితం ఇంటికి వచ్చి స్నేహితులను, బంధువును కలిసివెళ్లినట్టుగా చెబుతున్నారు. ఇక్కడున్న రెండు రోజులుచాలా సరదాగా గడిపినట్టు గుర్తు చేసుకున్నారు.

కర్తవ్య నిర్వహణలో విగతజీవులై.. 1
1/3

కర్తవ్య నిర్వహణలో విగతజీవులై..

కర్తవ్య నిర్వహణలో విగతజీవులై.. 2
2/3

కర్తవ్య నిర్వహణలో విగతజీవులై..

కర్తవ్య నిర్వహణలో విగతజీవులై.. 3
3/3

కర్తవ్య నిర్వహణలో విగతజీవులై..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement