
సర్కారు నిర్ణయం.. డీలర్లకు భారం
భీమడోలు: కూటమి సర్కారు నిర్ణయం రేషన్ డీలర్లకు భారంగా మారింది. ప్రభుత్వం ఎండీయూ వాహనాలను తొలగించి ఇంటింటికీ రేషన్ రద్దు చేయడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో ఒక అడుగు వెనక్కు వేసి 65 ఏళ్లు నిండిన వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల ఇంటికే రేషన్ సరఫరా చేయాలని రేషన్ డీలర్లను ఆదేశించింది. జూలై నెల రేషన్ను ఈనెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ముందుగానే ఇంటింటికీ వెళ్లి డీలర్లు పంపిణీ చేయాలని పౌరసరఫరాల విభాగం అధికారులను ఆదేశించింది. అయితే క్షేత్రస్థాయిలో డీలర్ల ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.
డీలర్లకు కష్టాలు
రేషన్ డీలర్లలో ఎక్కువ మంది వృద్ధులు, మహిళలు, వితంతువులు, వికలాంగులుండడం.. కిలోమీటర్ల దూరంలో ఉన్న వృద్ధుల ఇంటింటికీ వెళ్లి రేషన్ సరఫరా చేయాల్సి రావడం వారికి తలకు మించిన భారంగా మారింది. వృద్ధుల ఇంటికి వెళ్లి రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందే గానీ బియ్యం, సరుకుల పంపిణీకి వాహనాన్ని కేటాయించలేదని, ఒక్క సంచి కూడా ఇవ్వలేదని, కమీషన్ సైతం పెంచలేదని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో 20 వేల రేషన్ కార్డులుండగా... 65 ఏళ్లు నిండిన వృద్ధుల రేషన్ కార్డులు 2406 ఉన్నాయి. వారందరికీ ఇళ్లకు వెళ్లి రేషన్ పంపిణీ చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి రేషన్ పంపిణీకి మండలానికి కొన్ని వాహనాలు కేటాయించాలని, దూరాభారాన్ని ఎదుర్కొంటున్న డీలర్లకు పారితోషికాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా భీమడోలు సీఎస్ డీటీ భరత్కుమార్ మాట్లాడుతూ వయోభారంతో ఉన్న డీలర్లు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.