
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాణిక్యరావు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఏలూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఎంటీవీ యూ ట్యూబ్ ఛానల్ చైర్మన్ కాగిత మాణిక్యరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఒంగోలులో నిర్వహించిన సంఘ 36వ రాష్ట్ర మహాసభల్లో ఈ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా మాణిక్యరావును ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు కే.శ్రీనివాసరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి కంచర్ల జయరాజు, ఐజేయూ జాతీయ కార్యదర్శి దూసనపూడి సోమ సుందర్, అభినందంచారు. అలాగే మాణిక్యరావు ఎన్నికపట్ల ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కేపీకే కిషోర్ శుభాకాంక్షలు తెలిపారు.
గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి
మండవల్లి: గూడ్స్ రైలు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కైకలూరు–మండవల్లి రైల్వే స్టేషన్ల మధ్య 68–17 కిలో మీటరు నెంబర్ వద్ద ఒక వ్యక్తి అజాగ్రత్తగా రైల్వే ట్రాక్ను దాటుతుండగా కై కలూరు వైపు నుంచి వస్తున్న గూడ్స్ రైలు ఢీకొని ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుడి వయస్సు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే గుడివాడ రైల్వే ఎస్సై ఫోన్ 94406 27570 లేదా 98662 21412 నంబర్లలో తెలియజేయాలని రైల్వే పోలీసులు కోరారు.
యువతి అదృశ్యంపై కేసు నమోదు
ఆకివీడు : యువతి అదృశ్యంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై హెచ్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం కలిదిండి మండలం కాళ్లపాలెంకు చెందిన యువతి (19) స్థానిక ఎస్ టర్నింగ్ ప్రాంతంలో నివసిస్తున్న తాత ఇంటి వద్దకు ఇటీవల వచ్చింది. ఈనెల 24వ తేదీ ఉదయం ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదని, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించక పోవడంతో యువతి తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.