
డ్రైవర్ తొందరపాటు వల్లే ప్రమాదం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల క్షేత్రంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి డ్రైవర్ కంగారు, తొందరపాటే కారణమని తణుకు ఆర్టీసీ డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. స్థానిక గుడిసెంటర్ నుంచి సుమారు 70 మంది యాత్రికులతో తణుకుకు బయల్దేరిన ఏపీ16జెడ్ 215 నెంబర్ ఆర్టీసీ బస్సు డీసీసీబీ బ్రాంచి ఎదురుగా ఉన్న దేవస్థానం స్ట్రీట్లైట్ స్తంభాన్ని, ఆ తరువాత షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం బస్సు బ్రేక్లు విఫలం కావడం వల్లే జరిగిందని డ్రైవర్ శ్రీనివాస్ తెలిపారు. బస్సును నిశితంగా పరీక్షించిన తణుకు డిపో మెకానికల్ సిబ్బంది బస్సుకు ఏ విధమైన కంప్లైంట్లు లేవని, బ్రేక్లు బాగానే ఉన్నట్టు తేల్చారని డిపో మేనేజర్ తెలిపారు. గుడి సెంటర్ నుంచి కిందకు దిగుతున్న సమయంలో డ్రైవర్ కొద్దిపాటి కంగారు, తొందరపాటు వల్లే బస్సు డ్రైనేజీలోకి జారి ఈ ప్రమాదం జరిగిందన్నారు. గత పది రోజులుగా ఈ బస్సుకి ఏ విధమైన కంప్లైంట్లు లేవని తెలిపారు. విచారణ అనంతరం ప్రమాదానికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని గిరిధర్ కుమార్ పేర్కొన్నారు.