పని గంటల పెంపుపై మండిపాటు | - | Sakshi
Sakshi News home page

పని గంటల పెంపుపై మండిపాటు

Jun 21 2025 3:49 AM | Updated on Jun 21 2025 3:49 AM

పని గంటల పెంపుపై మండిపాటు

పని గంటల పెంపుపై మండిపాటు

భీమవరం: రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక విధానం లేకుండా కేంద్ర ప్రభుత్వ విధానాలకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జేఎన్‌వీ గోపా లన్‌ మండిపడ్డారు. రాష్ట్ర కేబినేట్‌ పని గంటల పెంపు, మహిళలు రాత్రి సమయాల్లో పనులు చేయడానికి అంగీకరిస్తూ తీసుకున్న నిర్ణయాలు కార్మికులకు ఇబ్బందులు కలిగించేలా ఉన్నాయంటూ శుక్రవారం స్థానిక ప్రకాశం చౌక్‌ సెంటర్‌లో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ లేబర్‌ కోడ్లపై దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం పరిశీలించకుండా అంగీకరించడం దారు ణమన్నారు. కార్మికుల ఆరోగ్యం, కనీస వేతనాల అమలును పట్టించుకోలేదన్నారు. అలాగే మద్యం, మత్తుపదార్థాల అనర్థాలు, మహిళలపై దాడులను అరికట్టడంతో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఏఐటీయూసీ నాయకుడు చెల్లబోయిన రంగారావు, టీయూసీసీ నాయకులు దండు శ్రీనివాసరాజు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.వాసుదేవరావు, కలిపిండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

యోగా డేకు పటిష్ట ఏర్పాట్లు

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతిఒక్కరూ పాల్గొనేలా చూడాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లాలో నమోదైన 8.80 లక్షల మంది యోగా కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలన్నారు. అలాగే భీమవరం కలెక్టరేట్‌ వద్ద 5 వేల మందితో నిర్వహించే యోగా కార్యక్రమం ఏర్పాట్లపైనా కలెక్టర్‌ సమీక్షించారు. కలెక్టరేట్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో చేపట్టిన ఏ ర్పాట్లను రాత్రి కలెక్టర్‌ నాగరాణి జేసీ టి.రాహు ల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో మొగలి వెంకటేశ్వర్లు, అధికారులు పరిశీలించారు.

మున్సిపల్‌ కార్మికుల దీక్షలు

తణుకు అర్బన్‌: మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) జిల్లా కార్యదర్శి గెల్లా విజయకుమార్‌ ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు. తణుకు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం కార్మికులు నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి అవుట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్నా తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. జేఏసీ గౌరవ అధ్యక్షుడు మీసాల పాపారావు, అధ్యక్షుడు ఉండ్రాజవరపు శ్రీను, ఉపాధ్యక్షుడు పీతల శ్రీదేవి, ఉప కార్యదర్శి పడాల దానం జైసిల్‌రాజు, పిండి పెద్దిరాజు, జి.నాగబాబు పాల్గొన్నారు.

ధాన్యం బకాయిలు చెల్లించాలి

భీమవరం: రైతులు తోలిన ధాన్యానికి ప్రభుత్వం సొమ్ములు చెల్లించకపోవడం దారుణమని, తక్షణం ధాన్యం బకాయిలు చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం భీమవరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం డబ్బులు చెల్లించకుండా జాప్యం చేయడంతో రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సార్వా సీజన్‌ ప్రారంభం కావడంతో వ్యవసాయ పనులకు చేతుల్లో డబ్బులు లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. జిల్లాలో రైతులకు రూ.293 కోట్ల మేర బకాయిలు ఉన్నా నాయకులు నోరుమెదపకపోవడం సరికాదన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.వాసుదేవరావు పాల్గొన్నారు.

ప్రత్యేక సబ్‌ డివిజన్‌ డ్రైవ్‌

భీమవరం(ప్రకాశంచౌక్‌): జిల్లాలో రీ సర్వే పూర్త యిన గ్రామాల్లో జాయింట్‌ ఎల్‌పీఎంల కారణంగా పథకాలు పొందడంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక సబ్‌ డివిజన్‌ డ్రైవ్‌ చేపట్టిందన్నారు. రెవెన్యూ శాఖ సబ్‌ డివిజన్‌ సేవ కోసం రూ.50 రుసుం చెల్లిస్తే జాయింట్‌ పట్టాదారుల భూములకు ఉచితంగా సబ్‌ డివిజన్‌ చేస్తామన్నారు. ఈ అవకాశం నెలాఖరులోపు దరఖాస్తు చేసుకున్న వారికే వర్తిస్తుందన్నారు. ఈ మేరకు రైతులు సబ్‌ డివిజన్‌ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement