
పోలీస్ గస్తీకి కొత్త వాహనాలు
భీమవరం: జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ, శక్తి బృందాల గస్తీకి కేటాయించిన 16 నూతన మోటార్ సైకిళ్లను గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాహనాల ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసు సేవలు అందించడానికి కృషి చేయాలన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, మహిళలు, బాలికల భద్రతకు దోహదపడే శక్తి బృందాల గస్తీని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయన్నారు. అడిషినల్ ఎస్పీ వి.భీమారావు, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, డీఎస్పీలు ఆర్జీ జయసూర్య, జి.శ్రీవేద, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ పరీక్షలకు 97 శాతం హాజరు
భీమవరం: జిల్లాలోని ఐదు కేంద్రాల్లో గురువారం నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షలకు 97 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. ఉదయం 623 మందికి 599 మంది, మధ్యాహ్నం 580 మందికి 568 మంది హాజరయ్యారన్నారు.
ఏలూరులో 1,030 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో గురువారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు 1,030 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 174 మందికి 171 మంది, మధ్యాహ్నం 189 మందికి 180 మంది, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 150 మందికి 141 మంది, మధ్యాహ్నం 140 మందికి 138 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 197 మందికి 193 మంది, మధ్యాహ్నం 215 మందికి 207 మంది హాజరయ్యారని డీఈఓ ఎం. వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
సమ్మెలోకి మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులు
తాడేపల్లిగూడెం (టీఓసీ): మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలోని అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఈనెల 22 నుంచి పూర్తిస్థాయిలో విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళుతున్నట్టు ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగపు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు హెచ్చరించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం కార్మికులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. నాయకులు మర్రిపూడి సతీష్ కుమార్, అవిడి కుమార్, నూకపల్లి శేఖర్, య ర్రంశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, వేతనాలు పెంచాలని, కార్మికులను మానవ వనరుల విధానంలోకి తీసుకురావాలని, అన్నిరకాల బెనిఫిట్స్ అందజేయాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, మున్సిపల్ ఇంజనీర్ వెంకట రమణ, అధికారులకు సమ్మె నోటీసులు అందించారు.
ఐటీఐల్లో ప్రవేశాలు
ఉండి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాలకు వచ్చేనెల 15న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు గడువు ఉందని ఐటీఐ జిల్లా కన్వీనర్ వి.శ్రీనివాసరాజు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్ లేదా ఫెయిలైన విద్యార్థులు ఐటీఐ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకుని, సమీపంలోని ప్రభు త్వ ఐటీఐలో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. వివరాలకు 08816 297093, 9676099988లో సంప్రదించాలని సూచించారు.
సాగుదారుల చట్టంపై ప్రచారోద్యమం
ఏలూరు (టూటౌన్): దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ జా యింట్ డైరెక్టర్ షేక్ హబీబ్ బాషా చేతులమీదుగా పంట సాగుదారులు చట్టంపై ప్రచారోద్యమం కరపత్రాలను గురువారం విడుదల చేశారు. హబీబ్ బాషా మాట్లాడుతూ జిల్లాలో డీబీఆర్సీ 2025– 26కి గాను భూమి ఉన్న రైతులు, కౌలుదారులకు అవగాహనా కార్యక్ర మం నిర్వహించడం శుభపరిణామమన్నారు.