
అధిక ఫీజులను ఉపేక్షించం
భీమవరం: ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూలు, విద్యా సామగ్రి అమ్మకాలను ఉపేక్షించబోమని కలెక్టర్ సీహెచ్ నాగరాణి హెచ్చరించారు. గురువారం స్థానిక విష్ణు కళాశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్, ఆన్ ఎయిడెడ్ పాఠశాలల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు వారి పిల్లలు భవిష్యత్తును గొప్పగా ఊహించుకుని ఫీజులు భారమైన ప్రైవేట్ స్కూల్స్ వైపు మొగ్గుచూపి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. దీనికి తోడు పుస్తకాలు, విద్యా సామగ్రి, కల్చరల్ యాక్టివిటీస్ వంటి వాటి పేరుతో యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయన్నారు. కొన్ని పాఠశాలలు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ అని చెప్పుకుంటున్నాయని, ఏ సిలబస్ అయినా ప్రభు త్వ నిబంధనల ప్రకారం నడపాల్సిందేనని స్పష్టం చేశారు. అధిక ఫీజులు వసూలుపై ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలు, డీఈఓ ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్లను మాత్రమే నియమించాలని, పాఠశాల వేళలను ప్రభుత్వం సూచించిన మేరకు కచ్చితంగా పాటించాలన్నారు. ఆర్జేడీ జి.నాగమణి, డీఈఓ ఈ.నారాయణ, ఎస్ఎస్ఏ పీఓ పి.శ్యామ్సుందర్, డిప్యూటీ డీఈఓలు పాల్గొన్నారు.
4,835 చోట్ల యోగా కార్యక్రమాలు
భీమవరం(ప్రకాశంచౌక్): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21న జిల్లాలో 4,835 చోట్ల యోగా కార్యక్రమాల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు.