
యోగా మంత్రం.. ఒత్తిడిలో యంత్రాంగం
పాలకోడేరు: కూటమి ప్రభుత్వం కొన్ని రోజలుగా నిరంతరం యోగా మంత్రం జపిస్తుండడంతో ప్రభుత్వ యంత్రాంగం ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతోంది. యోగాంధ్ర కార్యక్రమానికి మే 21 నుంచి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ కేంద్రంగా లక్షల మందితో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ కూడా హాజరవుతుండడంతో ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కుస్తీలు పడుతోంది. దీంతో అధికారులు, ఉద్యోగులకు క్షణం తీరిక లేకుండా పోయింది. యోగాంధ్ర ఎన్రోల్మెంట్, మాస్టర్ ట్రైనీ, రిజిస్ట్రేషన్, యోగ ప్రొటోకాల్ ఆసనాలు పూర్తి చేసినప్పటికీ జిల్లాస్థాయి యోగాసనాల పోటీల నిర్వహణ మాత్రం తమ వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. ఎందుకంటే సాధ్యం కానీ అలవాటు లేని ఆసనాలతో పోటీలు నిర్వహించాలని అధికారులు మార్గదర్శకాలు పేర్కొనడంతో కొత్తగా యోగా నేర్చుకున్న తాము ఈ ఆసనాలను ఎలా వేయగలమంటూ పోటీల్లో పాల్గొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
ఇవేం పోటీలు?
జిల్లా స్థాయిలో యోగా పోటీలకు సంబంధించి 10 నుంచి 18 సంవత్సరాలు, 19 నుంచి 35 సంవత్సరాలు, 35 పైబడి అంటూ మూడు భాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి 50 ఏళ్లు పైబడిన కేటగిరీ ఇవ్వకపోవడంతో యోగాలో అనుభవం, ఆసక్తి ఉన్న ఆ వయస్సు వారితో పోటీ పడే పరిస్థితి ఏర్పడింది. వారంతా పోటీలో పాల్గొనడానికి ఆసక్తి కనపరచడం లేదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వారిని సైతం పోటీల్లో అభ్యర్థులుగా చేర్చడంతో క్లిష్టతరమైన ఆసనాలు వేయలేమని తమ పేర్లను తొలగించాలని వారు కోరుతున్నారు. చిన్న పిల్లలకు ఆకర్ణ ధనురాసనం, బకాసనం, 19 నుంచి 35 సంవత్సరాల విభాగంలో మత్స్యేంద్రాసనం, జిల్లా స్థాయిలో విభక్త పశ్చిమోత్తాసనం తదితర ఆసనాలు వేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో పూర్ణమత్స్యేంద్రాసనం, ఓంకారాసనం, కర్ణ పీడనాసనం ఇచ్చారు. మండల స్థాయి పోటీలను ఏదోలా మమ అనిపించినప్పటికీ జిల్లా స్థాయి పోటీలకు వెళ్లేవారిని పంపించడం కష్టతరమేనని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
సమయం వృథా అంటూ ఆవేదన
యోగాంధ్ర కార్యక్రమం కోసం ప్రతిరోజు కలెక్టర్ నుంచి ఆయుష్ విభాగం అధికారులు పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు గూగుల్ మీట్, వెబ్క్స్ నిర్వహిస్తుండడంతో గంటల కొద్ది సమయం వృథా అవుతుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మూడు రోజులపాటు ఎటువంటి శ్రమ లేకుండా చేపట్టామని అధికారులు చెబుతుండడం గమనార్హం. అప్పటి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. కానీ ఇప్పుడు యోగాంధ్ర కోసం నెలరోజుల పాటు నరకయాతన పడుతున్నామని అధికారులు తమ అంతర్గత సంభాషణలో తలలు పట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమంతో పని ఒత్తిడి భరించలేక సచివాలయం నుంచి మండల స్థాయి ఉద్యోగులు అంతా నరకం చూస్తున్నారు.
యోగాంధ్ర విజయవంతానికి ప్రభుత్వం కుస్తీలు
ఉద్యోగులు, సిబ్బందిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి

యోగా మంత్రం.. ఒత్తిడిలో యంత్రాంగం