ఈ సమ్మర్‌ చాలా కూల్‌ గురూ.. | - | Sakshi
Sakshi News home page

ఈ సమ్మర్‌ చాలా కూల్‌ గురూ..

Jun 20 2025 5:23 AM | Updated on Jun 20 2025 5:23 AM

ఈ సమ్మర్‌ చాలా కూల్‌ గురూ..

ఈ సమ్మర్‌ చాలా కూల్‌ గురూ..

నరసాపురం: ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే ఎండలు అదరగొట్టాయి. ఉమ్మడి పశ్చిమలో ఫిబ్రవరి నెలలోనే 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కూడా భానుడు ప్రతాపం చూపించాడు. దీంతో ఈఏడాది వేసవిలో ఎండల ప్రతాపం దారుణంగా ఉంటుందని అంచనా వేశారు. వేసవిలో గరిష్టస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని జనవరి నెలలోనే విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినా అందుకు భిన్నంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలలో అయితే ఉమ్మడి పశ్చిమలో ఎక్కడా కూడా 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. జూన్‌ మొదటి వారంలో అత్యధికంగా 41 డిగ్రీలు, అత్యల్పంగా 39 డిగ్రీలు నమోదయ్యాయి. దీనికి తోడు ఈ ఏడాది రుతుపవనాల రాక కూడా దాదాపు 20 రోజులు ముందుగానే రావడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ప్రస్తుతం రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో 2005 తరువాత వేసవిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే ప్రథమం. దీంతో గోదావరి జిల్లాల వాసులు ఈ ఏడాది వేసవి తాపం తెలియకుండానే వర్షాకాలంలోకి ప్రవేశించారు.

రోహిణీ కార్తె ప్రభావం కూడా కనిపించలేదు

ఈ ఏడాది మే 24 వతేదీ నుంచి రోహిణీ కార్తె ప్రారంభమైంది. రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయని నానుడి ఉంది. రికార్డు స్థాయిలో ఉండే రోహిణి కార్తె ఎండలకు జనం బెంబేలెత్తుతూ ఉంటారు. అయితే ఈ ఏడాది రోహిణి కార్తె కూడా సాధారణ ఉష్ణోగ్రతలో కూల్‌గా గడిచిపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి ఈ ఏడాది వేసవి పెద్దగా ఇబ్బంది పెట్టకుండా కూల్‌గా గడిచిపోవడం విశేషం.

అప్పుడు కరోనా కారణంగా ఇళ్లలో ఉండి..

కరోనా కారణంగా వేసవిలో వరుసగా రెండేళ్లపాటు జనం ఇళ్లకే పరితమై వేసవి ప్రభావం పడకుండా తప్పించుకున్నారు. 2020 సంవత్సరంలో కరోనా విలయతాండవం, లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌, మే నెలలు మొత్తం జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక 2021లో కూడా మార్చి నెలలోనే కరోనా సెకండ్‌వేవ్‌ ప్రభావం ప్రారంభమైంది. ఏప్రిల్‌, మే నెలల్లో కల్లోలంగా మారడంతో దీంతో జనం పెద్దగా రోడ్కెక్కలేదు. ఆ రకంగా రెండేళ్లు అధిక మొత్తంలో జనం ఇళ్లపట్టునే ఉండి భానుడి ప్రతాపాన్ని చాలా వరకూ తప్పించుకున్నారు. నిజానికి ఈ రెండేళ్లు కూడా జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిల్లోనే నమోదయ్యాయి. అయితే ఈ సంవత్సరం మాత్రం రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కాకపోవడంతో జనం కూల్‌ కూల్‌గా ఖుషీ అయ్యారు.

వేసవిలో గోదావరి జిల్లాల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు

రోహిణి కార్తెలో కూడా ఎండలు ప్రభావం చూపని వైనం

రుతుపవనాలు విస్తరించడంతో చల్లబడ్డ వాతావరణం

మే మొత్తం కూల్‌.. జూన్‌లో కొంత ప్రభావం

ఈ ఏడాది మే నెల మొత్తం ఉమ్మడి పశ్చిమలో ఎండల ప్రభావం అంతగా కనిపించలేదు. అంతేకాకుండా మే 16, 17 తేదీల్లో వర్షాలు పడ్డాయి. గత ఏడాది కూడా మే నెలలో ఇదే సమయంలో వర్షాలు పడ్డాయి. అయితే తరువాత వడగాగాలలు దుమ్మురేపాయి. గత ఏడాది పడగాలులకు ఉమ్మడి జిల్లాలో 16 మంది మృత్యువాత పడ్డారు. అయితే ఈ ఏడాది వడగాలుల మరణాలు నమోదు కాకపోవడం విశేషం. ఇక మేనెల ఎండంటే తెలియకుండా గడిపేసిన జిల్లా వాసులకు జూన్‌ మొదటి వారంలో కొంత ప్రభావం కనిపించింది. జూన్‌ 2, 3 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీలు దాటి ఉఫ్ణోగ్రతలు నమోదయ్యాయి. మళ్లీ తరువాత అంతకు మించి ఉఫ్ణోగ్రతలు నమోదు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement