వనపర్తిటౌన్: విద్యా వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న వేసవి శిబిరాలతో విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలో విద్యా వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని.. ఉత్తీర్ణులయ్యేలా ఉపాధ్యాయులు చదివించాలని సూచించారు. ఉపాధ్యాయుల బోధనను శ్రద్ధగా వినడంతోనే కాకుండా అర్థం చేసుకుంటేనే పై తరగతుల్లో మంచి మార్కులు సాధించగలరన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ అధికారి శేఖర్, కమ్యూనిటీ మొబైల్ అధికారి ప్రతాప్రెడ్డి, మండల విద్యాధికారి మద్దిలేటి, జీహెచ్ఎంలు ఉమాదేవి, వరలక్ష్మి, సువర్ణాదేవి, శివకుమార్, ఉపాధ్యాయులు ధర్మరాజు, సామాజికవేత్త గంధం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


