
యోగాతో ఆరోగ్యం పదిలం
గోపాల్పేట: నిత్యం యోగా చేయడంతో ఆరోగ్యంగా ఉండవచ్చని.. దినచర్యలో భాగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య కోరారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రేవల్లి మండలం నాగపూర్లో 300 మందితో యోగా డే నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోజు కేవలం 20 నిమిషాలు యోగా చేస్తే మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. విద్యార్థులు సైతం యోగా చేయడంతో జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెప్పారు. అనంతరం శిక్షకుడు శ్రీనునాయక్ను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, డీఆర్డీఓ ఉమాదేవి, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గంధం నాగరాజు, లోడె రఘు, పాపులు తదితరులు పాల్గొన్నారు.
నేడు డయల్
యువర్ డీఎం
వనపర్తి టౌన్: డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని శుక్రవారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు తమ సమస్యలు, సలహాలు, సూచనలు, ఫిర్యాదులను సెల్నంబర్ 73828 26289కు సంప్రదించి తెలియజేయాలని పేర్కొన్నారు.
రామన్పాడులో
నిలకడగా నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకుగాను గురువారం 1,017 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వలో నీటి సరఫరా లేదని.. రామన్పాడు నుంచి కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నామని వివరించారు.
నేడు మంత్రి
వాకిటి శ్రీహరి రాక
ఆత్మకూర్: తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి శుక్రవారం మధ్యాహ్నం పట్టణానికి రానున్నట్లు కాంగ్రెస్ నాయకులు రహ్మతుల్లా, పరమేష్, తులసీరాజ్, శ్రీను తెలిపారు. మంత్రి హోదాలో తొలిసారి వస్తున్నందున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామని, అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.