
భూ సేకరణ వేగవంతం చేయాలి
వనపర్తి: మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన కాల్వల భూ సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణపై ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ కేటగిరి భూ సేకరణను సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖిల్లాఘనపురం మండలం షాపూర్ పరిధిలో 28 ఎకరాలు, మల్కాపూర్లో 8.35 ఎకరాలు, బుద్ధారం పరిధిలో 109 ఎకరాల భూ సేకరణకు సంబంధించి వారం రోజుల్లో అవార్డు పాస్ చేయాలన్నారు. రేమద్దుల పరిధిలో 6 ఎకరాలు, గణప సముద్రంలో 388 ఎకరాలకు ఎంజాయ్మెంట్ సర్వే 10 రోజుల్లో పూర్తిచేసి నివేదిక అందజేయాలని సర్వే అధికారిని ఆదేశించారు. అదేవిధంగా గోపాలపేట మండలం పొల్కెపహాడ్, దత్తాయపల్లిలో 12.87 ఎకరాలకు త్వరగా అవార్డు పాస్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భూ సేకరణలో ఉన్న స్ట్రక్చర్లను గుర్తించి వ్యాల్యూవేషన్ వివరాలు సమర్పించాలని ఆర్డబ్ల్యూఎస్, ఉద్యాన అధికారులను ఆదేశించారు. సమీక్షలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి, కార్యనిర్వాహక ఇంజినీర్ మధుసూదన్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మేఘారెడ్డి, ఇరిగేషన్ డీఈలు, ఏఈలు, సూపరింటెండెంట్ మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి
కొత్తకోట రూరల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గురువారం మండలంలోని వడ్డేవాటలో జరిగిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు హాజరై అనంతరం అదే గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు కంసలి పార్వతమ్మ ఇంటిని సందర్శించి పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఆషాఢ మాసం రోజులు బాగోలేవని పనులు ప్రారంభించలేదని సమాధానమివ్వగా మూఢ నమ్మకాలతో కాలయాపన చేయొద్దని.. గడువులోగా పనులు ప్రారంభించకుంటే రద్దవుతుందని కలెక్టర్ వివరించారు. గ్రామానికి మొత్తం 23 ఇళ్లు మంజూరు కాగా.. చాలామంది పనులు ప్రారంభించలేదన్నారు. మిగిలిన లబ్ధిదారుల ఇళ్లను కూడా కలెక్టర్ స్వయంగా పరిశీలించి త్వరగా పనులు ప్రారంభించాలని సూచించారు. అక్కడి నుంచి పెద్దమందడి మండలం వెల్టూరుకు వెళ్లి లబ్ధిదారు డి.పద్మ ఇంటి నిర్మాణానికి తహసీల్దార్తో కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించగా.. పంచాయతీ కార్యదర్శి జియో ట్యాగింగ్ చేసి ఆన్లైన్లో వివరాలు నమోదు చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామానికి 34 ఇళ్లు మంజూరయ్యాయని.. లబ్ధిదారులు త్వరగా ముగ్గు పోసి పనులు ప్రారంభించాలని సూచించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. పదోతరగతి పాసైన ప్రతి బాలికను కళాశాలలో చేర్పించేలా ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ కార్యదర్శి బాధ్యత తీసుకోవాలన్నారు.
పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేత..
వెల్టూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. పాఠశాలలో ఎంతమంది బాలికలు పదోతరగతిలో ఉత్తీర్ణత సాధించారు.. వారు ఇప్పుడేం చేస్తున్నారనే వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలకు పంపకుండా బాల్య వివాహాలు చేసే ప్రమాదం ఉందని.. కచ్చితంగా కళాశాలలో చేర్పించేలా ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట కొత్తకోట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పెద్దమందడి తహసీల్దార్ సరస్వతి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.