
ప్రజలకు సమర్థ సేవలు అందించాలి
వనపర్తి రూరల్: ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ సమర్థమైన సేవలు అందించాలని ఎస్పీ రావుల గిరిధర్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం జిల్లాకేంద్రంలోని రూరల్ పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పరిసరాలు, స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల రికార్డులు పరిశీలించారు. కేసుల దర్యాప్తులో అలసత్వం సరికాదని.. బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. బ్లూకోల్ట్ ,పెట్రోకార్ సిబ్బంది డయల్ 100 కాల్స్కు తక్షణమే స్పందిస్తూ ఘటనా స్థలానికి చేరుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో తరుచూ సందర్శించాలని, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రహదారి నిబంధనలు, సైబర్ నేరాలపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. పోలీస్స్టేషన్ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ క్రమశిక్షణతో మెలగాలని కోరారు. స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సిబ్భంది కృషి చేయాలని, అధికారులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తిస్తే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని వివరించారు. పాత నేరస్తుల కదలికలను ఏ విధంగా గుర్తిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆధునిక సాంకేతికతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆయన వెంట వనపర్తి సీఐ కృష్ణయ్య, నరేష్, ఎస్ఐ జలంధర్రెడ్డి, బాలయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ప్రాచీన కళలను బతికించుకుందాం
వనపర్తి రూరల్: సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన ప్రాచీన రంగస్థల కళలను బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శ్రీరంగాపురం మండలం వెంకటాపురం గ్రామంలో మూడు రోజులుగా కొనసాగుతున్న పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర (జీవ సమాధి ఘట్టం) నాటక ప్రదర్శనను గురువారం ఆయన తిలకించి మాట్లాడారు. రంగస్థల కళలు మన వారసత్వ సంపద అని.. కళలు మానసిక ఆనందాన్ని ఇవ్వడమేగాక గొప్ప సంస్కారాన్ని ప్రబోధిస్తాయని చెప్పారు. సినిమాలు, టీవీలు, సెల్ఫోన్లు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించి ఎంత కాలక్షేపాన్ని అందించినా నాటక రంగం గొప్పదనానికి సాటి రావని వివరించారు. గ్రామాల్లో నాటకాలు ఆదరింపబడుతున్నాయంటే అది పల్లె ప్రజల ఔదార్యానికి నిదర్శనమని కొనియాడారు. భావితరానికి రంగస్థల కళలను పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు.ఈ సందర్భంగా కళాకారులను ఆయన శాలువాలు, పూలమాలలతో సన్మానించి రూ.5 వేల విరాళాన్ని అందజేశారు. అనంతరం గ్రామస్తులు, కళాబృందం ఎస్పీని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో వనపర్తి ఎకై ్సజ్ సీఐ వెంకట్రెడ్డి, ఎస్ఐ రామకృష్ణ, పీఆర్వో రాజాగౌడ్, గ్రామ పెద్దలు, కళాకారులు, యువకులు పాల్గొన్నారు.