
‘ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి’
వనపర్తి రూరల్: ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు కోరారు. శనివారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) జిల్లా అధ్యక్షురాలు శారద అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయనతో పాటు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లు, ఆశాలను కార్మికులుగా గుర్తించాలన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారంగాకపోతే మే 20న కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బిలి నిక్సన్, అంగన్వాడీ సంఘం జిల్లా కార్యదర్శి నారాయణమ్మ, కవిత, జ్యోతి, అరుణ, కవిత, భాగ్యమ్మ, భాగ్యలక్ష్మి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.