‘యువ వికాసం’ దరఖాస్తులకు ప్రత్యేక కౌంటర్‌ | - | Sakshi
Sakshi News home page

‘యువ వికాసం’ దరఖాస్తులకు ప్రత్యేక కౌంటర్‌

Apr 5 2025 12:28 AM | Updated on Apr 5 2025 12:28 AM

వనపర్తి: రాజీవ్‌ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణకు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. శుక్రవారం పెబ్బేరు ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌ను వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలోని నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. నెలాఖరు వరకు నిర్మాణం పూర్తి చేయాలని హౌసింగ్‌ విభాగం డీఈ విఠోభాకు సూచించారు. అక్కడి నుంచి పట్టణంలోని మూడోనంబర్‌ రేషన్‌ దుకాణాన్ని సందర్శించారు. స్టాక్‌ రిజిస్టర్‌, బియ్యం పంపిణీ విధానాన్ని పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సన్నబియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక నుంచి ప్రతి నెల సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్‌ లక్ష్మి, ఎంపీడీఓ రవీంద్ర, ఇతర అధికారులు ఉన్నారు.

‘రేషన్‌’ దరఖాస్తుల పరిశీలన వేగవంతం

జిల్లాలో రేషన్‌ దుకాణాలకు సన్న బియ్యం రవాణా, పంపిణీ వేగవంతం చేసినట్లు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి వివరించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. కొత్త ఆహార భద్రత కార్డుల జారీకి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి బియ్యం రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పేదలతో కలిసి సన్న బియ్యంతో భోజనం చేయాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జి.వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల డీఎం జగన్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement