పాన్గల్: ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిపిల్లల సంబరాల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఉపయోగపడుతాయని.. విద్యార్థుల ఆలోచన విధానాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తల్లిదండ్రులు, దాతలు తోడ్పాటునందించాలని కోరారు. క్రాఫ్ట్ మేళాలో విద్యార్థులు తయారుచేసిన వస్తువులను ఆయన పరిశీలించారు.