జలం.. తగ్గుముఖం | - | Sakshi
Sakshi News home page

జలం.. తగ్గుముఖం

Mar 17 2025 10:27 AM | Updated on Mar 17 2025 10:26 AM

రోజురోజుకు పడిపోతున్న భూగర్భ నీటిమట్టం

రెండునెలలు గడ్డుకాలమే..

రానున్న ఏప్రిల్‌, మే మాసంలో భూగర్భ జలమట్టం మరింత తగ్గే అవకాశాలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా చెరువులు, రిజర్వాయర్లలో గతేడాదితో పోలిస్తే నీటి నిల్వలు కొంతమేర ఉండటం ఊరట కలిగిస్తున్నా.. పరిస్థితులు కఠినంగానే ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న రెండునెలలు జిల్లా ప్రజలు, రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

వనపర్తి: రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నాలుగు నెలల నుంచి వరుసగా భూగర్భ జలమట్టం తగ్గిపోతోంది. దీంతో జిల్లాలోని పానగల్‌, వనపర్తి, పెద్దమందడి, గోపాల్‌పేట, వీపనగండ్ల, కొత్తకోట, మదనాపురం తదితర మండలాల్లో సాగు చేసిన పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులోనూ నీటినిల్వ తగ్గిపోవడం, జూరాల, భీమా, కేఎల్‌ఐ ప్రాజెక్టుల నుంచి సాగునీటి సరఫరా నిలిచిపోవడంతో భూగర్భ జలాలు సైతం తగ్గుతూ వస్తున్నాయి. ఫిబ్రవరిలో కొంతమేర స్థిరంగా ఉన్నా.. మార్చిలో పెరిగిన ఉష్ణోగ్రతలతో చాలావరకు భూగర్భ జలాలు పడిపోయాయి.

జిల్లాలో 30 ఫిజియో మీటర్లు..

జిల్లావ్యాప్తంగా 15 మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో భూగర్భ జల పరిశోధనశాఖ ఆధ్వర్యంలో 30 ఫిజియో మీటర్లు (భూగర్భ జలాలను కొలిచే యంత్రాలు) ఏర్పాటు చేయగా ఇందులో 15 మాన్యువల్‌, మరో 15 ఆటోమేటిక్‌ పద్ధతిన పని చేస్తున్నారు. ప్రతినెల చివరి వారంలో భూగర్భ జలమట్టం ఎలా ఉందనే విషయాన్ని వీటి ద్వారా అధికారులు సేకరిస్తారు. ప్రస్తుతం సాగునీటి కాల్వల్లో నీటి సరఫరా నిలిచిపోవడంతో గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. సాగునీరు సరిపడా అందక యాసంగి వరిసాగు చేసిన రైతులు పంటలు ఎండిముఖం పట్టడంతో లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉండగా పంటలు కోత దశకు వచ్చిన రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వనపర్తి మండలం పెద్దగూడెం, శివారు ప్రాంతాల్లో సుమారు 80 ఎకరాల వరకు వరి పంటలు ఎండుముఖం పట్టినట్లు రైతులు చెబుతున్నారు. వరి పంటకు చివరి దశలో నీరందించకపోతే దిగుబడి తగ్గి నష్టం వాటిల్లే పరిస్థితులు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. సమస్యను వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని చెబుతున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయా గ్రామాల్లో ఎండిన పంటలను పరిశీలించి నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.

ఫిబ్రవరిలో కొంత ఊరట..

జిల్లాలో గతేడాది అక్టోబర్‌ నుంచి వరుసగా భూగర్భ జలాలు తగ్గుతూ వస్తున్నాయి. ఫిబ్రవరిలో కొంతమేర ఊరట కలిగించినా మార్చిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో తగ్గుతున్నాయి. – దివ్య జ్యోతి,

ఏడీ భూగర్భ జలపరిశోధనశాఖ, వనపర్తి

వట్టిపోతున్న బోరుబావులు.. ఎండుతున్న పంటలు

మొదలైన సాగునీటి కష్టాలు

లబోదిబోమంటున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement