విజయనగరం: ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళలను చులకనగా చూడడం తగదని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి మండిపడ్డారు. నాడు ఓట్ల కోసం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ మాట ఇచ్చిన నాయకులు, నేడు ఆ మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఉచిత ప్రయాణంలో మహిళలు పడుతున్న ఇబ్బందులను తొలగించే చర్యలు తీసుకోవాలని డిమాండ చేశారు. ప్రయాణికుల రద్దీకి తగిన బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ విజయనగరం నియోజకవర్గ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆర్టీసీ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి హయాంలో మహిళల ఆత్మగౌరవం పెరిగేలా పాలన సాగిస్తే, నేటి చంద్రబాబు ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. పేరుకు ఉచిత బస్సు ప్రయాణం అని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. అవసరమైన బస్సులు లేక నిత్యం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకోవడంతో దురదృష్టవశాత్తూ ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, నగర విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, నగర మాజీ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు, మహిళా విభాగం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఉచిత బస్సు ప్రయాణంలో
మహిళలకు తప్పని పాట్లు
వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన


