● ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్
ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన
కార్యదర్శి జగన్ మోహనరావు
విజయనగరం గంటస్తంభం: మున్సిపాలిటీల్లో చెత్త తరలింపు వాహనాలకు సంబంధించి ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి డ్రైవర్లు, కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. జగన్ మోహనరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక రింగ్రోడ్ డంపింగ్యార్డు వద్ద కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం డ్రైవర్ల వేతనాలు పెంచడంతో పాటు పలు సమస్యల పరిష్కారానికి హామీలు ఇచ్చిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం వాటిపై జీఓలు జారీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం మున్సిపల్ వాహనాలను ఔట్సోర్సింగ్కు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీంతో కార్మికులను అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కార్మికులను పర్మినెంట్ చేయాలని, 12వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు మున్సిపల్ డ్రైవర్లు, కార్మికులు పాల్గొన్నారు.


