● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్
జామి: దళారీలను నమ్మి మోసపోవద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎస్.కోట బార్ కౌన్సిల్ అధ్యక్షుడు అల్లు సత్యాజీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజలకు అర్హత ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందకపోయినా, రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాకపోయినా నేరుగా న్యాయసేవా కేంద్రంలో ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. ఈ కేంద్రం ద్వారా ఉచితంగా సేవలందిస్తామని చెప్పారు. ఎస్.కోట జూనియర్ సివిల్ జడ్జి బి.కనకలక్ష్మి మాట్లాడుతూ.. పేదలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ న్యాయసేవా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిన్న చిన్న విషయాలకు కోర్టులను ఆశ్రయించవద్దని.. వీలైనంతవరకు గ్రామపెద్దల సమక్షంలో రాజీ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు ఎం.దొరబాబు, బి.వెంకటరావు, జి.చిట్టిబాబు, శివ,ప్రసాద్, తహసీల్దార్ వి.కృష్ణంరాజు, ఎంపీడీఓ ఎన్.అప్పలనాయుడు, ఎస్సై వీరజనార్దన్, తదితరులు పాల్గొన్నారు.


