మంత్రి ఇలాకాలో మద్యం దందా..! | - | Sakshi
Sakshi News home page

మంత్రి ఇలాకాలో మద్యం దందా..!

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గంలో లిక్కర్‌ దందా సాగుతోంది. అక్రమ వ్యాపారానికి ప్రత్యేక కౌంటర్‌ తెరిచారు. ఇన్నాళ్లూ నకిలీ మద్యం మాత్రమే ఉందని మందుబాబులు భావించేవారు. ఇప్పుడు గరిష్ట చిల్లర ధర(ఎమ్మార్పీ) ఉల్లంఘనకు తెరతీయడంతో ఆందోళన చెందుతున్నారు. లిక్కర్‌ షాపులను ప్రధాన వనరుగా మార్చుకున్న ‘పెద్దలు’ ఒక్కో క్వార్టర్‌ మీద రూ.10, బీరుపై రూ.10 అద నంగా వసూలు చేస్తున్నారు. ప్రీమియం క్వాలిటీ బ్రాండెడ్‌ మద్యం ఫుల్‌బాటిల్‌ మీద రూ.50 వరకు అదనపు భారం వేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఎండకాలం చల్లగా బీర్లు ఉండాలంటే రూ.10 ఇవ్వాలి బ్రదర్‌ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు.

మంత్రి ఇలాకాలో అంతేమరి...

గజపతినగరం నియోజకవర్గంలోని దత్తిరాజేరు, బొండపల్లి, గంట్యాడ, గజపతినగరం మండలాల్లో మొత్తం 17 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇవి లాటరీలో ఎవరికీ దక్కినప్పటికీ వాటిని సిండికేట్‌ రూపంలోకి మార్చి ఆ సిండికేటును టీడీపీ నాయకులే నడిపిస్తున్నారు. ఎమ్మార్పీ ధరలకు అమ్ముతుంటే తమకు అనుకున్న లాభాలు రావడం లేదని... ఇలాగైతే మద్యం షాపు దక్కించుకుని ప్రయో జనం ఏముందని భావించిన వాళ్లంతా మంత్రి వద్ద తమగోడు వెళ్లబోసుకోగా... ఎమ్మార్పీ ధరలకు మించి అమ్ముకునేందుకు మంత్రితోపాటు, మాజీ ఎంపీపీ కొండబాబు కూడా మద్దతు ఇచ్చినట్టు సమాచారం. దీంతో ప్రతిసీసా మీద ఎమ్మార్పీ కంటే రూ.10 అదనంగా వేసి అమ్మకాలు సాగిస్తున్నారు. దీనిపై కొందరు మందుబాబులు వాగ్వాదం చేస్తున్నా... అదనపు వడ్డన మానడంలేదు.

అంతా ఓ మాజీ జెడ్పీటీసీ కనుసన్నల్లోనే...

ఈ మద్యం సిండికేటు ఏర్పాటు... వారి మధ్య ఏర్పడే చిక్కులు... వాటాల పంపకం.. తదితర బాధ్యతలన్నీ ఓ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చూస్తున్నారు. పోనీ ఇంత పెద్దరికం చేస్తున్నందుకు మీ గురువుకు ఏమైనా కాణి పరకా మిగులుతుందా అంటే అబ్బే అదేం లేదు. మావాడిది అంతా పైసారాని దండాసి చాకిరీ అని ఆయన అనుచరులు సైటెర్లు వేసుకుంటున్నారు. ధరల పెంపు ద్వారా సమకూరుతున్న అదనపు ఆదాయంలో సగం నాయకుడికి... మిగతా సగం వ్యాపారులు... ఎకై ్సజ్‌ వాళ్లకు సర్దుబాటు చేస్తున్నట్లు చెబుతున్నారు.

మామ్మూళ్ల ‘మత్తు’...

వాస్తవానికి అక్రమాలు ఎక్కడ జరిగితే అక్కడే అధికారులకు పని ఉంటుంది. అక్కడే వాళ్ల పవర్‌ చూపుతారు. ఇప్పుడు లిక్కర్‌ షాపుల వాళ్లు రేట్లు పెంచి అమ్ముతుండడంతో ఎకై ్సజ్‌ అధికారులు కొందరు మా సంగతి ఏమిటి? రైడ్స్‌ చేయాలా ఏంది అంటూ కన్నుగీటుతున్నారు. వచ్చిన పది రూపాయల్లో మంత్రి ఖాతాలోకి కొంత... సిండికేట్‌కు కొంత.. పోలీసులు.. ఎకై ్సజ్‌ వాళ్లకు కొంత ఇచ్చుకుంటూ వస్తున్నామని మద్యం వ్యాపారులే బహిరంగంగా చెబుతున్నారు. ప్రతినెలా గజపతినగరం నియోజకవర్గంలో సుమారు రూ.9 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ధరలు పెంచడంతో నెలకు రూ.50లక్షల వరకు మందు బాబులపై పడుతోంది. అ‘ధన’పు వసూళ్లు అన్నీ వాటాలుగా పంచుకుంటున్నారు.

చర్యలు తీసుకుంటాం

జిల్లా వ్యాప్తంగా ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం.

– బి.శ్రీనాథుడు,

అబ్కారీ శాఖ సూపరింటెండెంట్‌

Advertisement
 
Advertisement
Advertisement