పారదర్శకత కల్పనకే ఆర్టీఐ చట్టం
● జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్
విజయనగరం ఫోర్ట్: ప్రజలకు ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకత కల్పించేందుకు, బాధ్యాతాయుత పరిపాలనను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని 2005లో అమలు చేసిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎ.కృష్ణప్రసాద్ తెలిపారు. స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో ఏపీఎంల సమాఖ్య అకౌంటెంట్లు, డీఈఓలకు సమాచార హక్కు చట్టంపై బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ చట్టం ద్వారా ఎవరైనా భారత పౌరుడు ప్రభుత్వ కార్యాలయాలకు దరఖాస్తుచేసిన 30 రోజుల్లోపు అవసరమైన సమాచారాన్ని పొందవచ్చన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, యువత, రైతులు ఈ చట్టాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి, ఏపీడీ సావిత్రి, ఏఓ దొర, డీపీఎం చిరంజీవి, రవికుమార్, లక్ష్మినాయుడు, తదితరులు పాల్గొన్నారు.
‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం
విజయనగరం అర్బన్: దివ్యాంగులకు ఉచిత బస్సుప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుధవారం విజయనగరం ఆర్టీసీ డిపో ఆవరణలో ప్రారంభించారు. దివ్యాంగులకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్, సిటీ బస్సుల్లో వంద శాతం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఏసీ, ప్రీమియం బస్సుల్లో 50 శాతం రాయితీ కొనసాగుతుందని చెప్పారు. దివ్యాంగులకు సహాయకులుగా వచ్చే వారికి కూడా నిబంధనల మేరకు 50 శాతం రాయితీ ఉంటుందని వివరించారు. జిల్లాలో సుమారు 30 వేల మంది దివ్యాంగులు ఉన్నప్పటికీ కేవలం 1,200 మందికే బస్సు పాసులున్నాయని, మిగిలిన వారు సదరం సర్టిఫికెట్, ఆధార్తో పాసులు పొందాలని సూచించారు. అనంతరం దివ్యాంగులకు పాసులు అందజేసారు. కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, ఎమ్మెల్యే అదితి, రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ యశస్విని, జెడ్పీ సీఈ ఓ సత్యనారాయణ, జి ల్లా ప్రజారవాణా అధికారి జి.వరలక్ష్మి, దివ్యాంగుల సంక్షేమ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


