విజయనగరం క్రైమ్ : కానిస్టేబుల్ టి.తిరుపతిరావు కుటుంబానికి తోటి సిబ్బంది, బ్యాచ్మేట్స్ తమ వంతు ఆర్థిక సాయం చేశారు. గజపతినగరం పోలీసు సర్కిల్, జుడిషియల్ సిబ్బంది రూ.4.30 లక్షల నగదును ఎస్పీ ఏఆర్ దామోదర్ చేతుల మీదుగా డీపీఓలో ఈ మేరకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సహోద్యోగి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. 2012 బ్యాచ్కు చెందిన గజపతినగరం కానిస్టేబుల్ టి.తిరుపతిరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. తిరుపతిరావు కుటుంబ పరిస్థితిని గుర్తించిన సహచర సిబ్బంది, అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు నగదు సేకరించి కుటుంబ సభ్యులకు అందజేశారు. తిరుపతిరావు కుటుంబానికి జిల్లా పోలీసు శాఖ అండగా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, గజపతినగరం సీఐ జీఏవీ రమణ, ఎస్ఐ కె.కిరణ్కుమార్నాయుడు తదితరులు ఉన్నారు.


