విజయనగరం రూరల్: విజయనగరం జేఎన్టీయూ–జీవీ, హైదరాబాద్కు చెందిన మెటా–గేట్ కోచింగ్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. స్థానిక జేఎన్టీయూ జీవీలో మంగళవారం జరిగిన ఎంఓయూలో ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ జీవీ ప్రిన్సిపాల్ కేసీబీ రావు మాట్లాడుతూ మెటా–గేట్ కోచింగ్ విద్యా సంస్థ మెటలర్జికల్ ఇంజినీరింగ్ విభాగంలో దేశంలోనే చురుగ్గా పని చేస్తున్న సంస్థని తెలిపారు. ఇంజినీర్ల కోసం గేట్ ప్రవేశ పరీక్షకు సిద్ధం చేయడంలో సహాయపడుతుందని తెలిపారు. ఆనన్లైన్ శిక్షణ, స్టడీ మెటీరియల్స్, కెరీర్ గైడెన్స్ అందిస్తారని పేర్కొన్నారు. గతంలో ఉత్తీర్ణులైన కొందరు విద్యార్థులు వారి శిక్షణ ద్వారా ప్రయోజనం పొందుతున్నారని తెలియజేశారు. మెటలర్జికల్ ఇంజినీరింగ్లో బీటెక్/ఎం.టెక్ చదువుతున్న, ప్రతిభావంతులైన, ఆర్థికంగా వెనుకబడిన జేఎన్టీయూ–జీవీ విద్యార్థులకు సహాయం చేయడానికి, గేట్ పరీక్షకు నాణ్యమైన శిక్షణను అందించడానికి మెటా–గేట్ కోచింగ్ ముందుకు వచ్చిందన్నారు. విశ్వవిద్యాలయం విద్యార్థులకు గేట్ ఆన్లైన్ వీడియో లెక్చర్లను చూసేందుకు యాక్సెస్ అందించడం, ఆన్లైన్ టెస్ట్ సిరీస్లను రాసేందుకు యాక్సెస్ అందించడం, ప్రత్యేక సందేహల నివృత్తి సందేహాలను నిర్వహించడం, బార్క్ పరీక్షకు ప్రిపరేషన్, ఇంటర్వ్యూలపై మార్గదర్శకత్వం అందిస్తుందన్నారు. పీఎస్యూ, ప్రభుత్వ పరీక్షల (మెటలర్జికల్ – మెటీరియల్స్ ఇంజినీరింగ్కు సంబంధించినవి) ప్రిపరేషన్ ఇంటర్వ్యూల కోసం మార్గదర్శకత్వం వంటి సేవలను అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మెటలర్జీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కె.శ్రీనివాస ప్రసాద్, మెటా–గేట్ కోచింగ్ సంస్థ ప్రతినిధి సుభ్రదీప్ పాల్ తదితరులు పాల్గొన్నారు.


