సీతానగరం: మండలంలోని నిడగల్లు గ్రామ పరిధిలో రెండు ప్రతిపాదిత క్వారీల నిర్వహణపై మంగళవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఆయన స్వయంగా స్వీకరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ క్వారీ నిర్వహణలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని, కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. క్వారీ వల్ల చుట్టుపక్కల పొలాలకు, గాలికి ఎటువంటి నష్టం కలగకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలన్నారు. గ్రామస్తులు లేవనెత్తిన అంశాలను రికార్డు చేశామని, వాటిని నివేదిక రూపంలో ప్రభుత్వానికి, పర్యావరణ కమిటీకి పంపిస్తామని జేసీ తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.


