విజయనగరంలోని 18వ వార్డు సుద్దవీధిలో ఉన్న కేపీబీ ప్రాథమిక పాఠశాలను కాపాడాలంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. విజయనగరం కమిషన్ కార్యాలయం వద్ద మంగళవారం బైఠాయించారు. పాఠశాలలో 65 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఐదు తరగతులను కేవలం రెండు ఇరుకు గదుల్లో నిర్వహిస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. పాఠ్యాంశ బోధనకు అవరోధం కలుగుతోందని వాపోయారు. మరోవైపు పాఠశాల స్థలాన్ని కబ్జాచేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రుల వినతిమేరకు మంజూరుచేసిన రూ.22.18 లక్షలతో పాఠశాల నూతన భవనం నిర్మించాలని, బడి స్థలాన్ని కాపాడాలని కోరారు. కమిషనర్ కారుముందు బైఠాయించడంతో చేసేదిలేక కమిషనర్ బాలస్వామి వేరొకరి బైక్పై అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కె.జగదీష్, ఆర్.శిరీష, జిల్లా సహాయ కార్యదర్శులు సోమేశ్, వంశీ, భారతి, రమణ నాయకులు గుణ, మురళి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
– సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం


