● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం: శ్రీపరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ నెల 19న గురువారం ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. స్థానిక శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో జిల్లాస్థాయి ఉగాది వేడుకల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. జిల్లా పర్యాటక శాఖాధికారి వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించారు. వేదపండితుల ఆశీర్వచనం, పంచాంగ శ్రవణం, పండిత సత్కారం, కార్యక్రమానికి వచ్చిన అందరికీ పులిహోర, చక్కెర పొంగలి, ఉగాది పచ్చడి ఏర్పాటు చేయాలని దేవదాయశాఖ సహాయకమిషనర్కు ఆదేశాలు జారీచేశారు.
12 మంది బినామీలకు
నోటీసులు
● జిందాల్ చెల్లింపుల్లో తప్పులు...
● రూ.36.10లక్షల రికవరీకి చర్యలు
శృంగవరపుకోట: జిందాల్ కంపెనీకి కేటాయించిన భూములకు సంబంధించిన పరిహారం చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్టు నిర్ధారణ అయ్యిందని తహసీల్దార్ డి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు 12 మంది బినామీదారులు తీసుకున్న మొత్తం రూ.36.10 లక్షలు రికవరీకి మంగళవారం జప్తు నోటీసులు జారీచేశామన్నారు. 12 మంది బినామీదారుల నుంచి సొమ్ము వసూలు చేసేందుకు ఆర్.ఆర్.యాక్ట్ను అనుసరించి గతంలో రెండు దఫాలుగా నోటీసులు జారీ చేసినా వారు స్పందించక పోవడంతో జప్తు నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు. వారి ఆస్తులు వివాదాస్పద భూముల రిజిస్టర్లో నమోదు చేస్తామని, క్రయవిక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. బినామీదారుల్లో ఐదుగురి నివాస గృహాలను గుర్తించామని, వాటిని జప్తు చేసేందుకు నోటీసులు ఇచ్చామని, కాగా ఐదుగురికి ఎస్.కోట మండలంలో ఎటువంటి చర,స్థిర ఆస్థులు లేవని తెలిసిందని, వారిపై తదుపరి చర్యలకు కలెక్టర్కు నివేదిక సమర్పిస్తామన్నారు.


