మిషన్ వాత్సల్యకు రూ.కోటి 14లక్షలు మంజూరు
● ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి
తెర్లాం: మిషన్ వాత్సల్య పథకం కింద జిల్లాకు రూ.కోటి 14లక్షలు మంజూరయ్యాయని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్, మండల ప్రత్యేకాధికారి టి.విమలారాణి చెప్పారు. ఈ మేరకు గురువారం తెర్లాం ఎంపీడీఓ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో గల 410మంది అనాథ పిల్లలకు నెలకు రూ.4వేలు చొప్పున 7 నెలలకు మిషన్ వాత్సల్య పథకం కింద నిధులు మంజూరయ్యాయని, త్వరలో వారి బ్యాంక్ ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతాయని చెప్పారు. జిల్లాలో 2499 మెయిన్, మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో 22 కార్యకర్తల పోస్టులు, 277 హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు టీహెచ్ఆర్, కిట్లు, బాలామృతం సరఫరా సక్రమంగానే జరుగుతోందని చెప్పారు. తెర్లాం మండలంలో సచివాలయ సిబ్బంది కొరత కారణంగా యుఎఫ్ఎస్ సర్వేలో వెనుకబాటు ఉందన్నారు. శతశాతం సర్వే నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. మండలంలో అసంపూర్తిగా ఉన్న 130 ఇళ్లు ఉగాదిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వాటిని గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఐసీడీఎస్ పీడీ తెలిపారు. ఆమెతో పాటు మండల ఇన్చార్జ్ ఎంపీడీఓ వెంకటరమణ, డిఫ్యూటీ ఎంపీడీఓ నీలిమ ఉన్నారు.


