భూ ఆక్రమణదారులకు నోటీసులు
రాజాం: పట్టణంలోని పాలకొండ రోడ్డులో ప్రభుత్వ, దేవదాయశాఖ భూముల ఆక్రమణదారులకు దేవదాయశాఖ అధికారులు శనివారం నోటీసులు ఇచ్చారు. రాజాంలోని దేవదాయశాఖకు చెందిన స్థలాల ఆక్రమణపై ‘చూసెయ్ జాగా.. వేసెయ్ పాగా..!’ అనే శీర్షికన శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పట్టణంలో సర్వే నంబర్ 8లో కొన్ని స్థలాల అంశంపై వివాదం హైకోర్టులో పెండింగ్లో ఉన్నట్టు దేవదాయశాఖ రాజాం ఈఓ బీవీ మాధవరావు తెలిపారు. త్వరలో తీర్పు వెలువడనుందని, హైకోర్టు ఆదేశాలతో అక్కడ ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. మిగిలిన స్థలాల ఆక్రమణదారులకు దేవదాయ భూముల రికవరీ చట్టం సెక్షన్–83 ప్రకారం నోటీసులు ఇచ్చామని, ఉమామహేశ్వర లక్ష్మీనారాయణ స్వాముల దేవాలయానికి చెందిన ఈ స్థలాలు రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆక్రమణలు, కోర్టు వివాదాల స్థలాల వివరాలతో కూడిన నివేదికను ఉన్నతాధికారులకు అందించామని ఈఓ తెలిపారు.


