
పేదల భూముల ఆక్రమణపై విచారణ జరిపించండి
సాలూరు: నియోజకవర్గంలోని సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో దళితులు, గిరిజనులు, నిరుపేదల భూములు అన్యాయంగా ఆక్రమణలకు గురవుతున్నాయని, మంత్రి సంధ్యారాణికి చిత్తశుద్ధి ఉంటే వాటన్నింటిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మండలంలోని మోసూరు గ్రామంలో దళితులు సుమారు 24 ఏళ్ల క్రితం, వారికి పట్టాలివ్వక ముందు నుంచి బంజరుభూములు సాగుచేసుకోగా తరువాత ప్రభుత్వం వారికి పట్టాలిచ్చిందన్నారు. ఈ పట్టాలు ఇచ్చి సుమారు 20 సంవత్సరాలు దాటిపోయిందని, సుమారు 24 ఏళ్లుగా సాగుచేస్తున్న దళితుల భూముల మీదకు ఇటీవల విచారణలో భాగంగా అధికారులు స్థానిక బీసీలను తీసుకువెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మోసూరులో పాఠశాల భవనం కట్టిన స్థలం ప్రభుత్వానిదా? లేక జిరాయితీ స్థలమా? అన్న విషయం అధికారులు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తేల్చకుండానే దళిత ఎంఈఓపై సస్పెన్షన్ విధించడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జరాయితీ స్థలంలో పాఠశాల భవనం నిర్మించారని, పాఠశాల కావడంతో ఎవరూ ఏమీ అనలేదన్నారు. తరువాత భవనం పడిపోయి నిపపయోగంగా ఉండడంతో, స్థలం యజమాని భూమిని అమ్మగా స్థానిక సర్పంచ్ కొనుగోలు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని ఇల్లు నిర్మించుకున్నారన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేసిన తరువాత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదే మోసూరు గ్రామంలో చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని రెవెన్యూ సదస్సులో ఫిర్యాదు చేయగా, చెరువు ఆక్రమణ వాస్తవమేనని అంగీకరిస్తూ అది ఎవరు ఆక్రమించారో తెలియదని రెవెన్యూ అధికారులు పేర్కొనడం సమంజసం కాదన్నారు.
ప్రభుత్వ భూములు పేదలకు ఇవ్వాలి
నిజంగా గ్రామంలోని చెరువులు ప్రభుత్వానికి అవసరం లేకపోతే అక్కడ ఉన్న దళితులు, గిరిజనులు, బీసీ, అగ్రవర్ణ పేదలకు ఇవ్వాలని కోరారు. దళితులు, గిరిజనుల భూములను ఎక్కడైనా ఎవరైనా ఆక్రమిస్తే దర్యాప్తు చేయించి, దర్యాప్తును అనుసరించి సర్వే చేసి అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయ పడ్డారు. ఇటీవల అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో తాను మాట్లాడిన విషయాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడంపై రాజన్నదొర స్పందిస్తూ, తాను మాట్లాడిన విషయాలను అంశాల వారీగా ప్రజలకు మీడియా ద్వారా వివరిస్తానన్నారు. ఆ సభలో తాను అంబేడ్కర్ రాజ్యాంగం గురించి మాత్రమే మాట్లాడానని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు, మున్సిపల్ వైస్చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్ గిరిరఘు, వైఎస్సార్సీపీ నాయకుడు మొకర లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర డిమాండ్