
మే 20న దేశ వ్యాప్త సమ్మె
● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ
పార్వతీపురం: దేశ వ్యాప్తంగా మే 20న తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ వెల్లడించారు. పట్టణంలోని సుందరయ్య భవనంలో శనివారం జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికులు హక్కులను కాపాడుకునేందుకు మళ్లీ పోరాటం చేయాలన్నారు. రానున్న మే డే రోజున పోరాట స్ఫూర్తిని రగిలించేలా ఘనంగా వేడుకలు నిర్వహించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మికులకు రక్షణగా ఉన్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లుగా మార్పు తీసుకురావడం కార్మికుల మెడకు ఉరితాడు లాంటిదన్నారు. కష్టపడే కార్మికులను కట్టుబానిసలుగా మార్చే ఈ చట్టాలకు వ్యతిరేకంగా కార్మికుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర పద్ధతుల్లో విరివిగా ప్రచారం చేసి మే 20న చేపట్టే సమ్మెలో కార్మిక వర్గం మొత్తం పాల్గొనేలా చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు డి.రమణారావు, కార్యవర్గ సభ్యులు బీవీ రమణ, ఎన్వై నాయుడు, ఆర్.రాము, కె.సాంబమూర్తి, వి.ఇందిర పాల్గొన్నారు.