మహారాణిపేట: జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన, జిల్లాలో ఎలక్టోరల్ ఫారమ్ల డిజిటైజేషన్ పురోగతిని వివరించారు. జిల్లాలోని మొత్తం 20,23,009 మంది ఓటర్లకు సంబంధించిన ఎలక్టోరల్ ఫారమ్లలో ఇప్పటివరకు 11,74,700 డిజిటైజేషన్ పూర్తయి 58.07 శాతం పురోగతి నమోదైనట్లు తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 93,785 ఈఎఫ్లు డిజిటైజేషన్ చేయగా, ప్రస్తుతం 8,48,309 ఈఎఫ్లు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. అలాగే 21,709 ఈఎఫ్లు (1.08 శాతం) అన్కలెక్టబుల్గా గుర్తించినట్లు వెల్లడించారు. కలెక్టరేట్ నుంచి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ప్రత్యేక అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
యుద్ధప్రాతిపదికన సర్ పూర్తి చేయాలి
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు మిగిలిన వారం రోజులు యుద్ధప్రాతిపదికన పనిచేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈనెల 11,12 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ చేపట్టాలని, విస్తృత ప్రచారంతో ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. హోర్డింగులు, సోషల్ మీడియా, ఆటో మైకులు, సినిమా థియేటర్ల ద్వారా అవగాహన కల్పించాలని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్, జీవీఎంసీ కార్యాలయాల్లో ప్రత్యేక ఎస్ఐఆర్ హెల్ప్డెస్క్లు, శిబిరాలు నిర్వహించాలని తెలిపారు.


