తీవ్ర ఉద్రిక్తత.. కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు | High Tension at Visakha Fishing Harbour | Sakshi
Sakshi News home page

ఫిషింగ్‌ హర్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు

Jul 8 2026 11:59 AM | Updated on Jul 8 2026 3:55 PM

High Tension at Visakha Fishing Harbour

సాక్షి,విశాఖ: సముద్రంలో వేటకు వెళ్లి బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల ఘటన విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్రను మత్స్యకారులు అడ్డుకున్నారు. గల్లంతైన మత్స్యకారులు ఇంకా ఆచూకీ లభించకపోగా, మత్స్యకారులు ఇక లేరని నిర్ధారించాం’అంటూ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.  

దీంతో వారి ఆచూకీ తెలియజేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. మంత్రి కొల్లు రవీంద్ర కాన్వాయ్‌ను మత్స్యకారులు అడ్డుకోగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు బలవంతంగా పక్కకు లాగడంతో హార్బర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నెల 4న (శనివారం) జరిగిన బోటు ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. సుమారు 72 గంటలపాటు విస్తృతంగా గాలించినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. దీంతో కోస్ట్ గార్డ్ గాలింపు చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం బాధిత కుటుంబాలు, మత్స్యకారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.

ఈ నెల 1న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి ఏడుగురు మత్స్యకారులు బోటులో వేటకు బయలుదేరారు. అనంతరం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తిరుగు ప్రయాణంలో తీరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో వారి బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బోటు యజమాని కారి చిన్న మాత్రమే సమీపంలో వెళ్తున్న కార్గో నౌక సిబ్బంది సహాయంతో ప్రాణాలతో బయటపడగా, మిగిలిన ఆరుగురు సముద్రంలో గల్లంతయ్యారు.

కోస్ట్ గార్డ్ గాలింపు చర్యలను నిలిపివేయడం, అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో బాధిత కుటుంబాలు, తోటి మత్స్యకారులు విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందించినప్పటికీ ప్రభుత్వం దాదాపు 20 గంటల ఆలస్యంగా సహాయక చర్యలు ప్రారంభించిందని బాధిత కుటుంబాలు ఆరోపించాయి.

ప్రభుత్వమే న్యాయం చేయకపోతే మాకు న్యాయం చేసేది ఎవరు? పేద మత్స్యకారుల ప్రాణాలకు ప్రభుత్వానికి అంత చులకనా? అంటూ హార్బర్ యూనియన్ కార్యాలయం ఎదుట మహిళలు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అధికారులను నిలదీశారు.

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను పునఃప్రారంభించి, తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement