సముద్ర సింహం.. జాతిసేవకు సిద్ధం | Mahendragiri warship ready for commissioning on the 11th july | Sakshi
Sakshi News home page

సముద్ర సింహం.. జాతిసేవకు సిద్ధం

Jul 9 2026 6:03 AM | Updated on Jul 9 2026 6:04 AM

Mahendragiri warship ready for commissioning on the 11th july

11న జలప్రవేశానికి సిద్ధమైన మహేంద్రగిరి యుద్ధనౌక

డాక్‌యార్డులో జాతికి అంకితం చేయనున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 

మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌యార్డులో నిర్మితమైన ప్రాజెక్ట్‌–17ఏ వార్‌షిప్‌  

75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు  

శత్రునౌకల్ని నాశనం చేసే బరాక్‌–8, బ్రహ్మోస్‌ క్షిపణులతో యుద్ధసామర్థ్యం 

హిందూ మహాసముద్రంలో బ్రహ్మస్త్రంగా మారనున్న యుద్ధనౌక   

సాక్షి, విశాఖపట్నం: శత్రురాడార్లకు చిక్కకుండా కడలిలో దూసుకుపోతూ అగ్నిపర్వతంలా విరుచుకుపడే సముద్రపు సింహం.. ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి యుద్ధనౌక సమరశంఖం పూరించేందుకు సిద్ధమైంది. బరాక్, బ్రహ్మోస్‌ వంటి క్షిపణు­లతో సముద్ర ఉపరితలం నుంచి గగనతలంలోని శత్రువుల్ని చీల్చి చెండాడేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ వార్‌షిప్‌ని ఈ నెల 11న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విశాఖలోని నేవల్‌ డాక్‌యార్డులో జాతికి అంకితం చేయనున్నా­రు. మహేంద్రగిరి రాకతో హిందూ మహాసముద్రంలో భారత్‌ మరింత పట్టుసాధిస్తుందని రక్షణ వర్గాలు పేర్కొంటు­న్నాయి. 

భారత నౌకాదళం మరింత ఆధునికీకరణను సొంతం చేసుకుంటోంది. సముద్రజలాల్లో మన సార్వభౌమాధికారాన్ని సవాలు చేసే శత్రుదేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా సరికొత్త యుద్ధనౌకల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా అత్యాధునిక సాంకేతికత, దేశీ­య నైపుణ్యాల కలబోతతో రూపుదిద్దుకున్న అద్భుతమైన స్టెల్త్‌ ఫ్రిగెట్‌ నౌకకు ఒడిశాలోని తూర్పు కనుమల్లో విస్తరించి ఉన్న పర్వత శిఖరం మహేంద్రగిరి పేరు పెట్టారు.   

స్వదేశీ స్వావలంబనకు సజీవ సాక్ష్యం 
రక్షణశాఖ శివాలిక్‌ క్లాస్‌ ఫ్రిగేట్లకు కొనసాగింపుగా ఆత్మ­నిర్భర్‌ భారత్‌కి అద్దం పట్టేలా ప్రాజెక్టు–17ఏని చేపట్టింది. ఇందులో భాగంగా మొత్తం 7నౌకలను నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఆ జాబితాలో చివరి నౌకే ఈ మహేంద్రగిరి. ముంబైకి చెందిన మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మించింది. ఈ నౌక నిర్మాణంలో ఉప­యోగించిన పరికరాలు, వ్యవస్థల్లో 75 శాతం దేశీయ ఎంఎస్‌ఎంఈల నుంచే సేకరించడం విశేషం. ఐఎన్‌ఎస్‌ మహేం­ద్రగిరి నిర్మాణం శత్రువుల కళ్లకు గంతలుకట్టే అధునా­తన సాంకేతికతతో సాగింది. శత్రుదేశాల రాడార్లు పసిగట్టలేనంత పకడ్బందీగా దీన్ని రూపొందించారు. 

ఆధునిక సెన్సార్లు, రాడార్‌ వ్యవస్థలతో పటిష్టంగా నిర్మితమైన ఈ నౌక యుద్ధాలను ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉంటుంది.  హిందూ మహాసముద్రంలో చైనా వంటి దేశాల కదలికలు, వ్యూహాత్మక మార్పుల నేపథ్యంలో మహేంద్రగిరి వార్‌­షిప్‌ భారత నౌకాదళానికి కొండంత బలాన్నిస్తోంది. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా సముద్రంలో నిరంతర నిఘా వేయగల సత్తా దీని సొంతం. సముద్రదొంగల అణిచివేత, సుదూర తీరప్రాంతాల రక్షణ, విపత్తుల వేళ సహాయక చర్యల్లో దీని పనితీరు అత్యుత్తమంగా ఉండనుంది. సముద్రజలాల్లో మన ఉనికిని బలంగా చాటుతూ, భవిష్యత్తు నౌకాదళ అవసరాలకు పూర్తిస్థాయిలో సరిపోయే మహేంద్రగిరి యుద్ధనౌక .. భారత్‌కు తిరుగులేని శక్తిగా మారనుంది.  

ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి స్వరూపం
పొడవు:     149 మీటర్లు 
వెడల్పు:     17.8 మీటర్లు 
డ్రాఫ్ట్‌ :     5.22 మీటర్లు 
బీమ్‌:     17.8 మీటర్లు 
వేగం:     గంటకు 28 నాటికల్‌ మైళ్లు 
సామర్థ్యం: ఏకధాటిగా 5,500 నాటికల్‌ మైళ్లు  
క్షిపణులు:  బరాక్‌–8, సూపర్‌ సోనిక్‌  బ్రహ్మోస్‌ క్రూయిజ్‌  క్షిపణులు  
జలాంతర్గామి విధ్వంసక శక్తి: నీటి అడుగున పొంచి ఉన్న శత్రు జలాంతర్గాములను పసిగట్టి నాశనం చేయడానికి అధునాతన టార్పెడో ట్యూబ్‌ లాంచర్లు, యాంటీ–సబ్‌మెరైన్‌ ఆయుధాలు 
ఎయిర్‌క్రాఫ్ట్‌లు: 2 హాల్‌ ధృవ్, సీకింగ్‌ హెలికాఫ్టర్లు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement