మహారాణిపేట: జిల్లా రెవెన్యూ శాఖలో కీలకమైన జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) పోస్టుకు ప్రభుత్వం ఎట్టకేలకు నియామకం చేపట్టింది. గత ఏడాది అక్టోబర్ 21న డీఆర్వో బి.హెచ్.భవాని శంకర్ను బదిలీ చేసిన తరువాత ఈ పదవి ఇన్చార్జిలతో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇన్చార్జి డీఆర్వోగా ఉన్న గృహ నిర్మాణ సంస్థ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) సత్తిబాబును ఇటీవల విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారిగా నియమించారు. అనంతరం ఈ పోస్టు మళ్లీ ఖాళీ కావడంతో కలెక్టరేట్లో పనిచేస్తున్న కెఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శేష శైలజను ఇన్చార్జి డీఆర్వోగా నియమించారు. ప్రస్తుతం ఆమెనే ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కడప జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న ఎం.విశ్వేశ్వర నాయుడును విశాఖ జిల్లా డీఆర్వోగా నియమిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్జీడీసీ)గా పనిచేసిన విశ్వేశ్వర నాయుడు గతంలో విశాఖ జిల్లాలో పలు పదవుల్లో పనిచేశారు. కలెక్టరేట్ పరిపాలనాధికారిగా (ఏవో), రూరల్ తహసీల్దార్గా సేవలందించిన ఆయనకు విశాఖ ప్రాంతంపై మంచి పరిచయం ఉంది.
ఆర్డీవోకు బదిలీ
ఇన్చార్జి విశాఖ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) సనపల సుధా సాగర్కు బదిలీ అయింది. గతంలో విశాఖ ఆర్డీవోగా పనిచేసిన పి.శ్రీలేఖను గత ఏడాది అక్టోబర్ 21న బదిలీ చేశారు. అనంతరం హెచ్పీసీఎల్ ఎస్డీసీ (భూసేకరణ అధికారి)గా ఉన్న సుధాసాగర్ను ఇన్చార్జి ఆర్డీవోగా నియమించారు. ఇప్పుడు ఆయన్ని విజయనగరం ఆర్డీవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


