సాక్షి, విశాఖపట్నం : విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి ఏపీఈపీడీసీఎల్ నిర్వహించిన ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమానికి సోమవారం 37 ఫిర్యాదులు వచ్చినట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంలో 37 మంది వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను నేరుగా సీఎండి దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడిలో జాప్యం, విద్యుత్ బిల్లులు, విద్యుత్ లైన్లు, స్తంభాల మార్పిడి, తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా సీఎండీ పృథ్వీతేజ్ మాట్లాడుతూ ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం ద్వారా వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టీవీ సూర్యప్రకాష్, ఎస్ హరిబాబు, సీజీఎం లు వి విజయలలిత, ఎల్ దైవప్రసాద్, జీఎంలు వీవీఎస్ఎన్వీ ప్రసాద్, ఎం ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.


