తాటిచెట్లపాలెం : విధి నిర్వహణలో మరణించిన ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగి కుటుంబానికి కార్పొరేట్ ప్రమాద బీమా కింద రూ. కోటి పరిహారాన్ని అందజేశారు. కాకినాడ సర్కిల్ పెద్దాపురం సెక్షన్లో జెఎల్ఎం గ్రేడ్–2గా పనిచేస్తూ గత ఆగస్టులో ప్రమాదవశాత్తు మరణించిన అరుమిల్లి రామకృష్ణ కుటుంబానికి ఈ ఆర్థిక భరోసా లభించింది. సోమవారం విశాఖలోని సంస్థ కార్యాలయంలో సీఎండీ పృధ్వీతేజ్ ఇమ్మడి చేతుల మీదుగా మృతుని తల్లి సూర్యకుమారికి ఈ చెక్కును అందజేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ శాలరీ సేవింగ్స్ ఖాతాకు అను బంధంగా ఉన్న బీమా పథకం ద్వారా ఈ మొత్తం సమకూరింది. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. క్లిష్ట సమయాల్లో ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడంలో బ్యాంక్ బీమా పథకాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్. హరిబాబు, ఎస్బీఐ అమరావతి డీజీఎం అశోక్ వి సోనునే, విశాఖ ఏజీఎం ఎస్ శ్రీనివాసరావు, చీఫ్ మేనేజర్లు ఏ శ్రీనివాస్, ఎల్ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


