నగర నడిబొడ్డున ఉన్న గురుద్వారా జంక్షన్ సాక్షిగా సామాన్యుడి గ్యాస్ కష్టాలు రోడ్డున పడ్డాయి. ఓ పక్క డిజిటల్ ఇండియా, డోర్ డెలివరీ అని గొప్పలు చెబుతున్నా..క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఆదివారం ఒక్క రోజు సెలవు వస్తే చాలు.. సోమవారం ఉదయానికే గ్యాస్ ఏజెన్సీల ముందు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఖాళీ సిలిండర్లను భుజాన వేసుకుని.. పనులన్నీ మానుకుని గంటల తరబడి ఎండలో పడిగాపులు కాస్తున్నారు. సిలిండర్ ఇంటికి రాకపోవడమే కాకుండా, స్వయంగా వెళ్లి తెచ్చుకోవాలన్నా చుక్కలు కనిపిస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీల నిర్వహణ లోపమో.. సరఫరాలో వైఫల్యమో తెలియదు కానీ సామాన్యుడి పొయ్యి వెలగాలంటే మాత్రం గంటల తరబడి రోడ్ల మీద నిలబడక తప్పడం లేదు. గ్యాస్ ధరల భారంతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యుడికి, ఈ నిరీక్షణ మరిన్ని కన్నీళ్లు మిగులుస్తోంది. అధికారులు, సంబంధిత కంపెనీలు ఇప్పటికై నా స్పందించి ఈ ‘గ్యాస్’ తిప్పలు తప్పించాలని జనం డిమాండ్ చేస్తున్నారు.
–ఫొటోలు : సాక్షి, ఫొటోగ్రాఫర్,
విశాఖపట్నం


