మహారాణిపేట: తిరుపతిలో మహిళా నిరసనకారులపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం ఎల్ఐసీ జంక్షన్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన చేపట్టనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ప్రకటించారు. సోమవారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారశైలిపై శాంతియుతంగా నిరసన తెలిపిన మహిళలపై టీడీపీ శ్రేణులు దాడి చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. బాధితులపైనే పోలీసులు అక్రమ కేసులు బనాయించి, పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు నిరసనగా నిర్వహించే ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కేకే రాజు పిలుపునిచ్చారు.


