రెండు మృతి, నాలుగు సజీవం
పరవాడ: పెదముషిడివాడలో ఒకేసారి ఆరు కొండచిలువలు కనిపించడం కలకలం రేపింది. స్థానిక కల్కి లేఅవుట్లో ఒకే చోట ఈ కొండచిలువలు ఉన్నట్లు శుక్రవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించి భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ పల్లా నాగమణి కుమారుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు పల్లా అప్పారావు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆయన స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న నాగరాజు.. ఆరు కొండచిలువలను పట్టుకున్నారు. అయితే, అప్పటికే వాటిలో రెండు కొండచిలువలు చనిపోగా, నాలుగు ప్రాణాలతో ఉన్నట్లు నాగరాజు తెలిపారు. పట్టుబడిన ఒక్కో కొండచిలువ సుమారు 6.5 నుంచి 7 అడుగుల పొడవు ఉంటుందని వెల్లడించారు. ఒకేసారి ఇన్ని కొండచిలువలు బయటపడటంతో, వాటిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు.


