గంట వ్యవధిలో కన్నుమూసిన దంపతులు
మద్దిలపాలెం: భార్య మరణించిన గంట వ్యవధిలోనే భర్త కూడా కన్నుమూసిన హృదయవిదారక ఘటన శివాజీపాలెంలో చోటుచేసుకుంది. ఆంధ్ర యూనివర్సిటీలో హెడ్ కుక్గా రిటైర్ అయిన ఖాసీం, ఆయన భార్య తమ స్వగృహంలో గురువారం తుదిశ్వాస విడిచారు. స్థానికుల కథనం ప్రకారం.. ముందుగా ఖాసీం భార్య అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రాణప్రదమైన భార్య ఇక లేదన్న వార్తను తట్టుకోలేక, తీవ్రమైన బెంగతో గంట వ్యవధిలోనే ఖాసీం కూడా మరణించారు. అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండే ఈ దంపతుల మరణవార్త విని శివాజీపాలెం వాసులు కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం వీరిద్దరి అంత్యక్రియలు నిర్వహించారు.


