గాజువాక: జీవీఎంసీ గాజువాక జోనల్ కార్యాలయంలోని టౌన్ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. టౌన్ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టగా, అందులో భాగంగా గాజువాక కార్యాలయంలో కూడా సోదాలు జరిగాయి. ఏసీబీ సీఐ సుప్రియ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందం కార్యాలయంలోకి అకస్మాత్తుగా ప్రవేశించి టౌన్ప్లానింగ్ విభాగానికి సంబంధించిన రికార్డులను పరిశీలించింది. ఈ సందర్భంగా టౌన్ప్లానింగ్ సహాయ కమిషనర్ (ఏసీపీ) వెంకటరావుతో పాటు ఇతర సిబ్బందిని అధికారులు విచారించారు. ఇప్పటివరకు జారీ చేసిన భవన ప్లాన్ అనుమతులకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించి పూర్తి వివరాలను సేకరించారు. అధికారులు విభాగంలోకి వచ్చిన వెంటనే ఏసీపీతో పాటు సిబ్బందికి చెందిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కాల్ డేటా, నగదు లావాదేవీలను కూడా పరిశీలించారు. ఉదయం ప్రారంభమైన ఈ తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగాయి.


