ఆర్జేడీ విజయభాస్కర్
ఆరిలోవ: జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో జీవశాస్త్రం బోధించే ఉపాధ్యాయులకు మంగళవారం డీఈవో కార్యాలయ సమావేశ మందిరంలో ‘స్కూల్ హెల్త్ ప్రోగ్రాం’పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాం ద్వారా పాఠశాలల్లో ఆరోగ్య రక్షణ, విద్యార్థుల శారీరక మార్పులపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్జేడీ బి.విజయభాస్కర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో పిల్లలకు ఆరోగ్యం పట్ల కల్పించాల్సిన అవగాహన గురించి వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు యుక్త వయసులోకి ప్రవేశించినప్పుడు వారిలో కలిగే శారీరక, మానసిక మార్పులను గుర్తించి, వాటిపై సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సూచించారు. అప్పుడే విద్యార్థులు ఆందోళన చెందకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈవో ఎన్.ప్రేమకుమార్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.


