బీచ్రోడ్: సాగర తీరాన ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 12వ తరం వంశీకుల ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటన్నమాచార్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం గురజాడ కళాక్షేత్రంలో శ్రీనివాస కల్యాణం వైఖానస ఆగమ విధానంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అన్నమాచార్య సంకీర్తనల నడుమ, వేదఘోషల మధ్య జరిగిన ఈ కల్యాణోత్సవం భక్తులను ఆకట్టుకుంది. తాళ్లపాక వంశీకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం చూసిన భక్తులకు సాక్షాత్తు తిరుమలలో ఉన్నామనే భావన కలిగింది.
అనంతరం అన్నమయ్య సేవా కార్యక్రమాల భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష సేవలు అందిస్తున్న మహిళలను గుర్తిస్తూ ‘అన్నమయ్య ఆధ్యాత్మిక రథసారథులు’ పేరిట సత్కరించారు. ఈ సందర్భంగా విశాఖ నగరానికి చెందిన వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఐదుగురు మహిళలకు ‘అన్నమయ్య విశిష్ట మహిళా పురస్కారం’ అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు సాంప్రదాయ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.


